Sailor Jugraj Singh : హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్(Punjab)లో కనివినీ ఎరుగని రీతిలో వరదలు(Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్షాలకు ఓవైపు కొండచరియలు(Landslides) విరిగిపడుతుంటే.. మరోవైపు భీకరమైన వరద ఉధృతికి ఇండ్లు నేలమట్టం కాగా, భారీగా వాహనాలు వరద నీళ్లలో కొట్టుకుపోయాయి. ఈ విపత్కర పరిస్థితిలో ఒక యువ సెయిలర్(Sailor) అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ప్రాణాలకు తెగించి దాదాపు 150మందికి పైగా ప్రాణాలు కాపాడాడు. అతడి పేరు.. జుగ్రాజ్సింగ్(Jugraj Singh).
భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో పంజాబ్లో బసంత్నగర్(Basant Nagar) అతలాకుతలమైంది. దాంతో, జుగ్రాజ్ తన సెయిలింగ్ బృందంతో కలిసి స్థానికుల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF) బృందాల కంటే ముందుగానే వరద ముంపు ప్రాంతానికి చేరుకున్న జుగ్రాజ్సింగ్ బృందం రోపర్ సిటీ దగ్గరలోని తొలుత 70మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. మొత్తం పది సహాయక బృందాలు పాల్గొన్నాయి. వీళ్లలో ఇద్దరు హాకీ ప్లేయర్లు కూడా ఉన్నారు.
కాంస్య పతకంతో జుగ్రాజ్
ఈ సహాయ చర్యలకు కనోయిగ్, కయాకింగ్ కోచ్ జగ్జీవన్సింగ్(Jagjeevan Singh) సారథ్యం వహించాడు. కోచ్ అప్పజెప్పిన పనిని సమర్థంగా నిర్వహించిన జుగ్రాజ్ అందరి మన్ననలు పొందాడు. వీరి సాహాసాన్ని జిల్లా క్రీడాధికారి రూపేశ్కుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. అద్లాపూర్(Adlapur) గ్రామానికి చెందిన జుగ్రాజ్ ప్రస్తతం కత్లీలో పంజాబ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెయిలింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ కనోయి ఫెడరేషన్(ICF) ఆధ్వర్యంలో చైనాలో జరిగిన ప్రపంచ కప్లో జుగ్రాజ్ కాంస్య పతకం(Bronze Medal)తో మెరిశాడు.