ముంబై: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం రక్తదానం చేశాడు. ప్రాణాల్ని కాపాడటంలో రక్తం చాలా కీలకమని, సమయానికి దొరకక ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది ఉన్నారని మాస్టర్ పేర్కొన్నాడు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని సూచించాడు. మనకు ప్రాణాల్ని కాపాడే శక్తి ఉంది దాన్ని మనం వాడుదామంటూ సచిన్ ట్వీట్ చేశాడు. కొన్ని నెలల క్రితం తమ దగ్గరి బంధువులు రక్తం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి సమస్య ఎవరికి రావద్దన్న ఉద్దేశంతో రక్తదానానికి సిద్ధమయ్యానని తెలిపాడు.