Rohit Sharma : సొంత గడ్డపై 12 ఏండ్ల తర్వాత జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI WorldCup 2023)లో ఓటమన్నదే ఎరుగని భారత జట్టు టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచులు గెలిచిన రోహిత్ సేన రేపు న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. మెగా టోర్నీలో దంచికొడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఇది 9వ ఐసీసీ సెమీఫైనల్. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన రోహిత్ భారత్కు ఐసీసీ ట్రోఫీ అందించాలనే కసితో ఉన్నాడు.
ఐసీసీ సెమీఫైనల్లో హిట్మ్యాన్కు తిరుగులేని రికార్డు ఉండడం భారత్కు కలిసిరానుంది. ఇప్పటివరకూ ఎనిమిది సెమీఫైనల్లో బ్యాటింగ్కు దిగిన రోహిత్ 48.3 సగటుతో 293 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైన్లలో హిట్మ్యాన్ బంగ్లాదేశ్పై అజేయ శతకం(123 నాటౌట్)తో విరుచుకుపడ్డాడు. వన్డేల్లో 4 మ్యాచుల్లో 63.66 సగటుతో 191 పరుగులు సాధించాడు.
ప్రపంచ కప్లో భారత జట్టు ఫేవరేట్ ట్యాగ్ను నిలబెట్టుకుంటూ వరుసపెట్టి ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్కు అర్హత సాధించింది. ఓపెనర్గా బ్యాటుతో చితక్కొడుతున్న రోహిత్.. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ టోర్నీలో సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్న రోహిత్ 9 ఇన్నింగ్స్ల్లో 503 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం 4వ స్థానంలో నిలిచాడు.
𝗛𝗜𝗧𝗠𝗔𝗡 𝗦𝗣𝗘𝗖𝗜𝗔𝗟!
Captain Rohit Sharma now holds the record for the most ODI sixes in the calendar year 💥#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/YTCYHAKk7B
— BCCI (@BCCI) November 12, 2023
అంతేగాక ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ మెగాటోర్నీలో రోహిత్ 23 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన సారథులలో ఇయాన్ మోర్గాన్ (2019లో 22), ఏబీ డివిలియర్స్ (2015లో 21), ఆరోన్ ఫించ్ (2019లో 18) లు తర్వాత జాబితాలో ఉన్నారు.
న్యూజిలాండ్ VS భారత్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15 బుధవారం భారత్, న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. 2019 వరల్డ్ కప్ సెమీస్లో, 2021 టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో షాకిచ్చిన కివీస్పై బదులు తీర్చకోవాల్సిన టైమ్ వచ్చింది. మెగా టోర్నీ లీగ్ దశలో న్యూజిలాండ్ను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే కసితో ఉంది. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు అయ్యర్, రాహుల్, సూర్య, జడేజా సూపర్ఫామ్లో ఉండడం కలిసిరానుంది. బౌలింగ్లో బుమ్రా, షమీ, సిరాజ్ పేస్ త్రయం కివీ బ్యాటర్లను మరోసారి వణికించేందుకు ఎదురుచూస్తోంది.