Rohit Sharma : పొట్టి క్రికెట్లో విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడిన టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నాడు. దాంతో, కీలకమైన మూడో వన్డేకు అతడిని పక్కనబెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. సూర్యకుమార్కు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మద్దతుగా నిలిచాడు. రెండో వన్డేలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మూడో వన్డేకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియదు. ప్రస్తుతానికైతే నాలుగో స్థానం ఖాళీగా ఉంది.
అందుకనే సూర్యకు అవకాశం ఇచ్చాం. అతను వైట్బాల్ క్రికెట్లో ఎన్నో సంచలనాత్మక ఇన్నింగ్స్లు ఆడాడు. సత్తా ఉన్నా ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తామని నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను’ అని రోహిత్ అన్నాడు. దాంతో, మూడో వన్డేలోనూ సూర్య ఆడతాడని చెప్పకనే చెప్పాడు.
బోర్డర్ – గవాస్కర్ ఆఖరి టెస్టులో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదు. దాంతో, అతని ప్లేస్లో సూర్యకుమార్ను వన్డే సిరీస్కు సెలక్ట్ చేశారు. అయితే.. తొలి వన్డేలో సూర్యకుమార్, స్టార్క్ బౌలింగ్లో తొలి బంతికే ఎల్బీగా ఔటయ్యాడు. రెండో మ్యాచ్లో స్టార్క్(Mitchell Starc) బౌలింగ్లో అచ్చం అలానే మొదటి బంతికే ఎల్బీగా వికెట్ సమర్పించుకున్నాడు. టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్ అయిన సూర్యపై జట్టుకు, కెప్టెన్కు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, అతను మాత్రం నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికవరకు ఆడిన 16 వన్డేల్లో సూర్య ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66), ట్రావిస్ హెడ్ (51) చెలరేగడంతో 234 బంతులు ఉండగానే గెలుపొందింది. దాంతో, 1-1తో వన్డే సిరీస్ సమం చేసింది. కీలకమైన మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరనుంది.