Heather Knight : మనదేశంలో క్రికెట్ను ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా మనవాళ్లు క్రికెటర్లను అమితంగా ఆరాధిస్తారు. అందుకే, సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్(God Of Cricket)గా పేరొందాడు. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఆడుతున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ హీథర్ నైట్ (Heather Knight) తాజాగా భారత క్రికెట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఆడుతున్న ఆమె తన అనుభవాలు పంచుకుంది. భారత్లో క్రికెట్కు ఆదరణ ఎక్కువని, ఇక్కడి ప్రజలు క్రికెటర్లను దేవుళ్లుగా కొలుస్తారని ఈ ఆల్రౌండర్ తెలిపింది.
‘ఇండియాలో క్రికెట్కు ఉన్న ఆదరణ నమ్మశక్యం కాదు. క్రికెట్ ఆడేందుకు ఇదొక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ క్రికెటర్లను దేవుళ్లుగా కొలుస్తారు. భారతీయులు క్రికెట్ను అమితంగా ఇష్టపడతారు. నావరకైతే.. ప్రపంచంలో ఈ ఆటను ఎక్కువగా ఆస్వాదించే ఫ్యాన్స్.. ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే’ అని హీథర్ నైట్ వెల్లడించింది.
ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడిపోవడంతో ఇక ఆర్సీబీ కథ ముగిసింది అనుకున్నారంతా. కానీ, రెండో రౌండ్లో స్మృతి మంధాన సేన దుమ్ము రేపుతోంది. ఆ ఫ్రాంఛైజీ ఐపీఎల్ టీమ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మోటివేషనల్ స్పీచ్ ప్రభావంతో వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. అంతేకాదు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. యూపీ వారియర్స్ను చిత్తు చేసిన ఆ జట్టు… గత మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై భారీ విజయం సాధించింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ సోఫీ డెవినే (Sophie Devine) ఒంటి చేత్తే మ్యాచ్ను మలుపుతిప్పింది. 9 ఫోర్లు, 8 సిక్స్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకు పడిన ఆమె 99 రన్స్ చేసింది. సెంచరీకి ముందు షాట్ ఆడి ఔటయ్యింది. ఆ తర్వాత అలిసా పెర్రీ (19), హీథర్ నైట్ (22) జట్టును విజయ తీరాలకు చేర్చారు. తర్వాతి మ్యాచ్లో బలమైన ముంబై ఇండియన్స్ను ఆర్సీబీ ఢీకొట్టనుంది.