Suresh Raina :ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్లో జరగనుంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నమెంట్లో చాంపియన్గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఆ 20 మందిలో ఫలానా వాళ్లు ఉండాలని కొందరు మాజీ క్రికెటర్లు అభిలషించారు. తాజాగా, వరల్డ్ కప్ టీమ్లో యంగ్ ఆల్రౌండర్ దీపక్ హూడా(Deepak Hooda)కు అవకాశం ఇవ్వాలని, అతను బ్యాటుతో చెలరేగడమే కాకుండా బంతితో మ్యాజిక్ చేయగలడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘నాకు ఇప్పటికి గుర్తుంది. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేసేవాళ్లు. యూసుఫ్ పఠాన్, నేను కూడా బంతితో రాణించేవాళ్లం. దీపక్ హుడా కూడా వరల్డ్ కప్లో అచ్చం అలాంటి పాత్రనే పోషిస్తాడు. అని రైనా తెలిపాడు. అఅంతేకాదు అతను అతను చురుకైన ఫీల్డర్, వన్డేల్లో టీ20 ఫామ్ను కొనసాగిస్తాడు’ అని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. పోయిన ఏడాది నవంబర్లో న్యూజిలాండ్ సిరీస్లో హుడా చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ సిరీస్లో అతను రాణించకపోవడంతో స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్లకు ఎంపిక కాలేదు. ఇప్పటి వరకు హుడా 10 వన్డేలు ఆడాడు. 153 రన్స్ కొట్టాడు.
ఈ ఏడాది అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీలో 2011లో చాంపియన్గా అవతరించిన టీమిండియా మూడోసారి విశ్వ విజేతగా నిలవాలని భావిస్తోంది. 2011 తర్వాత ఇప్పటివరకూ భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. దాంతో, ఈసారి ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది.