Chris Gayle : వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్, విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ (Chris Gayle) తన ఐపీఎల్ జర్నీ గురించి షాకింగ్ విషయాలు చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)లో తనతో పాటు మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ ఉండేదని, అందుకనే ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవలేదని అతను తెలిపాడు. జియో సినిమాతో మాట్లాడిన గేల్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
‘నేను ఆర్సీబీకి ఆడే సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kholi), డివిలియర్స్ (AB de Villiers) మీదనే అందరి దృష్టి ఉండేది. దాంతో, మిగతా జట్టు సభ్యులు ఆర్సీబీతో తాము లేమనే మానసిక భావనతో ఉండేవారు. దాంతో, ఐపీఎల్ టైటిల్ గెలవడం కష్టంగా ఉండేది’ అని ఈ యూనివర్సల్ బాస్ వెల్లడించాడు.
ఈ కరీబియన్ ఓపెనర్ 2011లో ఆర్సీబీ జట్టుతో కలిశాడు. ఓపెనర్గా శుభారంభాలు ఇచ్చిన అతను ఎన్నో విధ్వసంక ఇన్నింగ్స్లు ఆడాడు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ తమ బ్యాటింగ్ విన్యాసాలతో ఆర్సీబీలో కొత్త ఉత్సాహం నింపారు. కానీ, ఇతర ప్లేయర్లు అంతగా రాణించకపోవడంతో ఆ జట్టు పదిహేను సీజనల్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2009, 2016లో ఆ జట్టు ఫైనల్ చేరింది. కానీ, రన్నరప్తోనే సరిపెట్టుకుంది. కోహ్లీ, డివిలియర్స్, గేల్, డేల్ స్టెయిన్ వంటి స్టార్లు ఉన్నా కూడా కీలక మ్యాచుల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడం ఆ జట్టకు పరిపాటి అయింది.
గత ఏడాది సీజన్ మధ్యలోనే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో, డూప్లెసిస్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్లో కప్పు కొట్టడమే లక్ష్యంగా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. మార్చి 31న 16వ సీజన్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.