టీమిండియా సారథి రోహిత్ శర్మ శుక్రవారం రాత్రి నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్ వీరవిహారంతో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగుల (8 ఓవర్లలోనే) లక్ష్యాన్ని టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సిక్సర్ల విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు.
నాగ్పూర్ మ్యాచ్లో లక్ష్య ఛేదనకు వచ్చిన రోహిత్.. తొలి ఓవర్ వేసిన జోష్ హెజిల్వుడ్ బౌలింగ్లో తాను ఎదుర్కున్న రెండో బంతికే సిక్సర్ కొట్టాడు. దీంతో అతడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (173) రికార్డును చెరిపేశాడు. రోహిత్ అదే ఓవర్లో తర్వాత బంతికి మరో సిక్సర్ తో పాటు ఈ మ్యాచ్లో మొత్తం నాలుగు సిక్సర్లు బాదాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 176 సిక్సర్లు (టీ20లలో) ఉన్నాయి. ఆ తర్వాత జాబితాలో మార్టిన్ గప్తిల్ (172), క్రిస్ గేల్ (124) ఉన్నారు. టీమిండియా తరఫున రోహిత్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన వీరుల్లో విరాట్ కోహ్లీ (104) రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక నాగ్పూర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 8 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. మాథ్యూవేడ్ (43 నాటౌట్), ఫించ్ (31) రాణించారు. అనంతరం ఛేదనలో భారత్.. 7.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి భారత్కు విజయాన్ని అందించాడు.