సానుకూల దృక్పథం.. మెండైన ఆత్మవిశ్వాసంతో వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగనున్నట్లు భారత సారథి రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్లో విజేతలుగా నిలవడమే తమ ధ్యేయమని వెల్లడించాడు. విజయాలు వడ్డించిన విస్తరిలా ముందుకు రావని.. వాటికోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని అన్నాడు. గాయాలు, శిక్షణ, జట్టు ఎంపిక, ఆసియాకప్ సన్నాహకాలు ఇలా పలు అంశాలపై హిట్మ్యాన్ తన అభిప్రాయాలు వ్యక్తంచేశాడు. హైదరాబాదీ యంగ్స్టర్ తిలక్ వర్మకు మంచి భవిష్యత్తు ఉందన్న రోహిత్.. మెగాటోర్నీకి ఎంపిక విషయం తన చేతిలో లేదని పేర్కొన్నాడు.
ముంబై: వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పుష్కర కాలం తర్వాత భారత జట్టు సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడుతుండగా.. ట్రోఫీ అందుకోవాలని ప్రతి ఒక్కరు తహతహలాడుతున్నారని రోహిత్ వెల్లడించాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత దశాబ్ద కాలంలో భారత జట్టు ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ప్రపంచకప్ సాధించడం పక్కా అని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. దశాబ్ద కాల నిరీక్షణకు తెరదించుతామని హిట్మ్యాన్ అన్నాడు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. గురువారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ పలు అంశాలపై మాట్లాడాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే..
ఇప్పటి వరకు నేను వన్డే ప్రపంచకప్ గెలువలేదు. అది నా చిరకాల కోరిక. దాని కోసం తీవ్రంగా కృషిచేస్తున్నా. గొప్ప విజయాలు సాధించాలంటే అంతకుమించి శ్రమించక తప్పదు. జట్టులో ప్రతి ఒక్కరు ప్రపంచ చాంపియన్ ట్యాగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మంచి జట్టు అందుబాటులో ఉంది. అందరిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. 2022 టీ20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ తీవ్రంగా ప్రయత్నించాం. కానీ నిరాశ ఎదురైంది. ఈ సారైనా దక్కుతుందని అనుకుంటున్నాం.
జట్టులో మొదట ఆటగాడిగానే నా స్థానం.. ఆ తర్వాతే సారథ్య బాధ్యతలు. కెప్టెన్సీని భారంగా భావించడం లేదు. భారీ స్కోర్లు చేసి జట్టు విజయానికి బాటలు వేయడమే నా పని. వన్డే ప్రపంచకప్పై దృష్టి పెట్టడం వల్లే నేను, కోహ్లీ, జడేజా టీ20లు ఆడటం లేదు. మెగాటోర్నీకి ముందు అంతా తాజాగా ఉండాలనుకుంటున్నాం. జట్టులో ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు గాయపడటంతో గాయాలంటేనే భయం అవుతున్నది. ప్రధాన టోర్నీలకు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా రొటేషన్ పద్ధతి పాటిస్తున్నాం.
వన్డేల్లో నిలదొక్కుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అలాంటి ఆటగాడికి అండగా నిలుస్తాం. రెండు మూడు మ్యాచ్ల్లో బాగా ఆడనంత మాత్రాన అతడిలో నైపుణ్యం లేనట్లు కాదు. విండీస్తో మూడో టీ20ల్లో ఓపెనర్లు విఫలమైనప్పుడు సూర్య బాధ్యత తీసుకున్న విషయం మరవకూడదు.
స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత నాలుగో స్థానంలో నిలకడగా రాణించేవాళ్లు లభించలేదు. శ్రేయస్ ఆ ప్లేస్లో కుదురుకున్నట్లే కనిపించాడు. అయితే గాయం కారణంగా జట్టు అతడి సేవలు కోల్పోయింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ వంటి నాణ్యమైన ప్లేయర్లు జట్టుకు దూరం కావడం ఇబ్బందే. జట్టులో ఎవరి స్థానం శాశ్వతం కాదు. నేనైనా నిరూపించుకోవాల్సిందే. రాహుల్, శ్రేయస్ నాలుగైదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నారు. శస్త్రచికిత్సల తర్వాత తిరిగి కోలుకొని ఆడటం చిన్న విషయమేం కాదు. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ కోసం జట్టు ఎంపిక జరగనుంది. చాలా మంది ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. ఒత్తిడిలో ప్లేయర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో ఆసియాకప్లో పరీక్షించాలనుకుంటున్నాం. ఒకరిద్దరికి బదులు చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండటం భవిష్యత్తు దృష్ట్యా మంచిదే.
విండీస్తో టీ20 సిరీస్లో తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ చాలా బాగా ఆడుతున్నాడు. నిలకడగా రాణిస్తూ నమ్మకం నిలబెట్టుకుంటున్నాడు. గత రెండేండ్లుగా అతడిని దగ్గర నుంచి చూస్తున్నా. పరుగులు చేయాలనే కసి అతడిలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అన్నింటికంటే అదే ముఖ్యం. అతడి వయసు 20 ఏండ్లే అయినా.. అంతకుమించిన పరిణతి కనబరుస్తున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తిలక్ అనవసర గందరగోళానికి గురవడు. ఎంతో స్పష్టతతో ఏ షాట్ ఆడాలో నిర్ణయించుకుంటాడు. కొద్ది కాలంలోనే అతడు తనను తాను నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్కప్ గురించి ఇప్పుడే చెప్పలేను కానీ.. తిలక్కు మంచి భవిష్యత్తు ఉంది.