Asia Cup 2023 : ఆసియా కప్ పోటీలకు భారత బృందం(Team India Squad) ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ప్రకటించిన 17 మంది స్క్వాడ్లో లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)కు చోటు దక్కకపోవడాన్ని మాజీలు తప్పు పడుతున్నారు. దాంతో, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయంపై స్పందించాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్పై దృష్టి పెట్టడంతో చాహల్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని అతను అన్నాడు. అంతేకాదు వరల్డ్ కప్ తలుపులు అందరికీ తెరిచే ఉన్నాయని తెలిపాడు.
‘ఆఫ్ స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్(R Ashwin), వాషింగ్టన్ సుందర్(Washington Sunder).. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలి? అని సుదీర్ఘంగా చర్చించాం. అలానే లెగ్ స్పిన్నర్ విషయంపైనా బాగా ఆలోచించాం. అయితే.. 8వ, 9వ స్థానంలో ధాటిగా ఆడగలిగిన వాళ్లకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. ఆసియా కప్ స్క్వాడ్లో 17 మందికి మాత్రమే చాన్స్ ఉంది. అందుకనే చాహల్కు చోటు దక్కలేదు’ అని హిట్మ్యాన్ వెల్లడించాడు. వరల్డ్ కప్ సన్నాహకాల గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. ‘జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah), ప్రసిధ్ కృష్ణ(Prasidh Krishna)లు చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చారు. వాళ్లు ఎలా రాణిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశాం. ఈ రెండు నెలలు సీమర్లు కీలక పాత్ర పోషించనున్నారు’ అని రోహిత్ తెలిపాడు.
కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్
ఆసియా కప్ బృందంలో చాహల్ లేకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) స్పందించాడు. జట్టులో సమన్వయం కోసమే అతడిని తప్పించామని చెప్పాడు. ‘శిఖర్ ధావన్ మాదిరిగా టీమిండియా తరఫున చాహల్ గొప్ప ప్రదర్శన చేశాడు. అయితే.. . ఈ ఈ ఏడాది అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. కుల్దీప్ యాదవ్ స్ట్రయిక్ రేటు కూడా బాగుంది. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను ఆడించడం కష్టం. అందుకని చాహల్కు చాన్స్ దక్కలేదు’ అని అగార్కర్ వెల్లడించాడు. ఆసియా కప్ కోసం ముగ్గురు స్పిన్నర్లను మాత్రమే సెలెక్ట్ చేశారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్గా చోటు సంపాదించగా, కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎంపికయ్యాడు.
తిలక్ వర్మ
గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ఈ టోర్నీతో జట్టులోకి వచ్చారు. దాంతో, టీమిండియా మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. విండీస్ పర్యటనలో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma)కు మరో అవకాశం వచ్చింది. ఆసియా కప్తో నాలుగో స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అనే దానిపై స్పష్టత రానుంది. ఈ ఏడాది ఆగస్టు 30న ఆసియా కప్ మొదలవ్వనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ ట్రోఫీకి భారత్, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి ట్రోఫీపై కన్నేసిన భారత్ ఆగస్టు 24న బెంగళూరులో శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడనున్నాయి.
భారత బృందం : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయష్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, సంజూ శామ్సన్.