పంత్ అజేయ శతకం
భారత్ రెండో ఇన్నింగ్స్ 198 ఆలౌట్
దక్షిణాఫ్రికా లక్ష్యం 212.. ప్రస్తుతం 101/2
తనపై వస్తున్న విమర్శలకు దీటుగా బదులిస్తూ.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అజేయ శతకంతో విజృంభించినా.. ఆఖరి టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లోనే కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ సాధ్యపడని సిరీస్ విజయాన్ని ఈ సారి కోహ్లీసేన ఒడిసి పడుతుందని భావిస్తే.. రెండో ఇన్నింగ్స్లో సఫారీల అనూహ్య పోరాటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో ఫలితం తేలడం పక్కా కాగా.. టీమ్ఇండియా మూడు దశాబ్దాల కల నెరవేరాలంటే 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంటే.. సఫారీలు సిరీస్ విజయానికి 111 పరుగుల దూరంలో ఉన్నారు. శుక్రవారం తొలి సెషన్లో మన పేసర్ల ప్రదర్శనపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది!
కేప్టౌన్: జట్టు సభ్యులంతా కలిసి 98 పరుగులే చేసిన చోట రిషబ్ పంత్ (139 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 198 పరుగులకు ఆలౌటైంది. మూడు గంటలకుపైగా క్రీజులో గడిపిన సారథి విరాట్ కోహ్లీ (143 బంతుల్లో 29) బ్యాట్తో గొప్ప సంయమనం ప్రదర్శించినా.. మిగిలినవాళ్లు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్ (10) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా.. పుజారా (9), రహానే (1), అశ్విన్ (7), శార్దూల్ (5) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో జాన్సెన్ 4, రబడ, ఎంగ్డీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 212 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 101/2తో నిలిచింది. కీగన్ పీటర్సన్ (48 బ్యాటింగ్), కెప్టెన్ ఎల్గర్ (30) రాణించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న సఫారీలు విజయానికి ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో వికెట్ పడగొట్టారు.
పంత్ అద్భుతః
పరిస్థితులను అర్థం చేసుకోకుండా.. చెత్త షాట్ సెలెక్షన్తో వికెట్ పారేసుకుంటున్నాడని విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్ తనకు అలవాటైన రీతిలో టూర్ ఆఖరి టెస్టులో బ్యాట్తో సత్తాచాటాడు. తన కెరీర్లోనే ‘ది బెస్ట్’ అనదగ్గ ఇన్నింగ్స్తో చెలరేగాడు. చివరి వరుస బ్యాటర్లను కాచుకుంటూ అతడు పరుగులు రాబట్టిన విధానం నభూతో! రబడ, ఎంగ్డీ ఎంత ఊరిస్తున్నా.. ఏమాత్రం సంయమనం కోల్పోని రిషబ్ తన సెంచరీతో పాటు జట్టు ఆధిక్యాన్ని రెండొందలకు చేర్చాడు. వచ్చీరాగానే భారీ షాట్లకు యత్నించి ఔటయ్యే పంత్.. ఈ మ్యాచ్లో నాటౌట్గా నిలిచాడంటే అతడి ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు!
145 ఏండ్ల టెస్టు క్రికెట్
చరిత్రలో ఒకే జట్టుకు చెందిన 20 వికెట్లు క్యాచౌట్ల ద్వారానే పడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ భారత ఆటగాళ్లంతా క్యాచ్లు ఇచ్చి ఔటయ్యారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 223,
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210,
భారత్ రెండో ఇన్నింగ్స్: 198 (పంత్ 100 నాటౌట్, కోహ్లీ 29; జాన్సెన్ 4/36, ఎంగ్డీ 3/21),
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 101/2 (పీటర్సన్ 48 నాటౌట్; షమీ 1/22).