Rishabh Pant : భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) వేగంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. ధనాధన్ బ్యాటింగ్తో అలరించే పంత్ ఈమధ్యే నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అలాగని అతను తక్కువ వేగంతో బంతులు విసిరే స్పిన్నర్లను ఆడడం లేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) వర్గాలు వెల్లడించాయి.
‘తొందరగా కోలుకునేందుకు పంత్ ప్రతి కష్టాన్ని దాటుతున్నాడు. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అతడిని చూస్తుంటే సంతోషంగా ఉంది. ఎన్సీఏకి వచ్చాక పంత్ ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఈ లెఫ్ట్ హ్యాండర్ శరీరాన్ని వేగంగా కదిలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’ అని ఎన్సీపే ఓ ప్రకటనలో తెలిపింది.
నిరుడు డిసెంబర్లో పంత్ కారు యాక్సెటెండ్కు గురయ్యాడు. మోకాలుకు బలమైన గాయం కావడంతో ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. దాంతో, అతను ముఖ్యమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy), వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు దూరమయ్యాడు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న అతను వరల్డ్ కప్(ODI World Cup 2023)లోపు ఫిట్నెస్ సాధించడం దాదాపు అసాధ్యమే.
శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్
అతడితో పాటు కేఎల్ రాహుల్(KL Rahul), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)లు కూడా ఎన్సీఏలోనే ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా ఆసియా కప్, వరల్డ్ కప్లోపు ఫిట్నెస్ సాధిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్న పంత్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అని చెప్పాలి. ఆసీస్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పంత్ లేకపోవడం భారత విజయావకాశాల్ని దెబ్బ తీసింది. ఈ ఏడాది వరల్డ్ కప్ అక్టోబర్ 5న భారత్లో మొదలవ్వనుంది. 2011లో స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు ట్రోఫీని సాధించింది. ఈసారి కూడా రోహిత్ సేన కప్పు కొట్టాలనే కసితో ఉంది.