ఆధునిక క్రికెట్లో నెంబర్ వన్ బౌలర్లుగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిదిలలో బెస్ట్ బౌలర్ ఎవరు..? అని అడిగితే తన ఓటు బుమ్రాకే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్. అఫ్రిది కంటే బుమ్రా అనుభవజ్ఞుడని, రాబోయే టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ పేసర్ కంటే భారత బౌలరే ఎక్కువ ప్రభావం చూపుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐసీసీ నిర్వహించిన ‘ఐసీసీ రివ్యూ’ కార్యక్రమంలో పాల్గొన్న పాంటింగ్కు ఈ ఇద్దరిలో రాబోయే టీ20 ప్రపంచకప్లో ఎవరు బాగా రాణించగలరు..? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి పాంటింగ్ స్పందిస్తూ.. ‘ఇద్దరూ గొప్ప బౌలర్లే. ఇద్దరినీ పోల్చడం సరికాదు. గడిచిన రెండు, మూడేండ్లుగా అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్న అతికొద్దిమంది బౌలర్లలో వాళ్లిద్దరూ ఉన్నారు. అయితే వచ్చే టీ20 ప్రపంచకప్లో మాత్రం అఫ్రిది కంటే బుమ్రానే ఎక్కువ ప్రభావితం చూపగలడు…
ఎందుకంటే అఫ్రిది కంటే బుమ్రా అనుభవజ్ఞుడు. అఫ్రిదితో పోల్చితే ఆస్ట్రేలియాలో బుమ్రానే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. అదీగాక మెగా టోర్నీల విషయంలో కూడా అతడే సీనియర్. అందుకే నా ఓటు బుమ్రాకే..’ అని చెప్పాడు. ఆన్లైన్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని బుమ్రా భార్య సంజనా గణేశన్ నిర్వహించడం గమనార్హం.
ఇక పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ల మధ్య బెస్ట్ బ్యాటర్ను ఎంపిక చేయాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేస్తారనే ప్రశ్నకు పాంటింగ్.. ‘బాబర్ టెక్నికల్గా బట్లర్ కంటే బెటర్ ప్లేయర్. కానీ స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే మాత్రం అసలు బట్లర్తో బాబర్కు పోలికే ఉండదు. ఆ విషయంలో బట్లర్ మెరుగైన బ్యాటర్. ఇంగ్లండ్ సారథి 360 డిగ్రీలు ఆడగల బ్యాటర్..’ అని తెలిపాడు.