వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తొలి వన్డేలో ఆడేది అనుమానమేనని తెలుస్తున్నది. మోకాలి గాయం తిరగబెట్టడంతో జడేజా విండీస్తో మొదటి వన్డేలో ఆడేది కష్టమేనని జట్టు వర్గాలు తెలిపాయి.
టీమిండియా సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ల గైర్హాజరీలో విండీస్తో సిరీస్కు శిఖర్ ధావన్, రవీంద్ర జడేజాలకు ఆ బాధ్యతలను అప్పజెప్పింది బీసీసీఐ. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే జడేజాకు గాయం కావడంతో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలినట్టైంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి జడేజా వరుసగా గాయాల బారిన పడుతున్నాడు. గతేడాది న్యూజిలాండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో గాయపడ్డ జడ్డూ.. తిరిగి శ్రీలంకతో సిరీస్లో అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్లో గాయపడి దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన అతడు.. ఇంగ్లండ్తో టెస్టులో పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్తో మూడో వన్డేలో భాగంగా అతడికి గాయమైనట్టు తెలుస్తున్నది.
ఇదిలాఉండగా జడేజా గాయాన్ని పరిశీలించిన వైద్యులు అతడు శుక్రవారం జరిగే తొలి వన్డే ఆడకపోవడమే ఉత్తమమని తేల్చినట్టు సమాచారం. అయితే నొప్పి తీవ్రత అలాగే ఉంటే తొలి వన్డేతో పాటు మొత్తం సిరీస్కు కూడా దూరంగా ఉండి టీ20లలో ఆడాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. జడేజా దూరం కావడంతో శిఖర్ ధావన్కు డిప్యూటీగా యుజ్వేంద్ర చాహల్ను గానీ శార్దూల్ ఠాకూర్ను గానీ నియమించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.