ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలని పట్టుదలగా ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మెగాటోర్నీకి దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు వెస్టిండీస్ పర్యటన సమయంలో కూడా మోకాలి నొప్పితో జడేజా కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు.
ఆసియా కప్లో పాకిస్తాన్, హాంగ్కాంగ్ మ్యాచులు ముగిసిన తర్వాత ఈ టోర్నీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతని మోకాలి గాయం చాలా సీరియస్గా ఉందని, త్వరలోనే సర్జరీకి వెళ్తాడని బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో జడ్డూ పునరాగమనం ఎప్పుడు ఉంటుందో చెప్పలేమని తేల్చేసింది.
చాలా కాలంగా ఇలా కుడి మోకాలి గాయంతో జడ్డూ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరమైంది. ముఖ్యంగా బౌలింగ్ చేసేటప్పుడు కుడి మోకాలిపై మరింత ఒత్తిడి పడుతుండటంతో జడేజా తట్టుకోలేకపోతున్నాడట. మరి ఈ సమస్య తీవ్రమైంది అయితే కోలుకోడానికి కనీసం ఆరు నెలలు పట్టే ఛాన్స్ ఉంది.
అంటే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్లో జడ్డూ ఆడటం కష్టమే. ఒక పక్క కట్టుదిట్టమైన బౌలింగ్తో వికెట్లు తీసుకుంటూ.. మరో పక్క అవసరమైన సమయంలో బ్యాటుతో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడుతూ జట్టులో బ్యాలెన్స్ తీసుకొస్తున్న జడ్డూ కనుక ప్రపంచకప్ ఆడకపోతే అది రోహిత్ సేనకు గట్టి ఎదురు దెబ్బేనని చెప్పక తప్పదు.