Ravi Shastri : ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ) గురించే మాట్లాడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ సన్నద్ధత, భారత్కు కలిసొచ్చే అంశాలు, తుదిజట్టులో ఎవరిని ఆడించాలి? వికెట్ కీపర్గా ఎవరైతే బెస్ట్? అనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. భారత జట్టు కూర్పుపై మాజీ కోచ్ రవిశాస్త్రి( Ravi Shastri) తన అభిప్రాయం వెల్లడించాడు.
ఏవిషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే అతను.. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటే వికెట్ కీపర్గా శ్రీకర్ భరత్(KS Bharat)ను ఆడించాలని అన్నాడు. ‘ఒకవేళ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ను ఎంచుకుంటే.. ఇషాన్ కిషన్కు చోటివ్వాలి’ అని అతను తెలిపాడు.
భారత జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) కారు యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే. దాంతో, అతడి ప్లేస్ కోసం శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై అద్భుతంగా కీపింగ్, బ్యాటింగ్ చేసిన భరత్ వైపే మాజీలు మొగ్గు చూపుతున్నారు. అయితే.. ధనాధన్ ఆడే ఇషాన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడని కొందరు అంటున్నారు. కానీ, అతడు ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అనుభవం లేని అతడి కంటే భరత్ నయం అనే వారూ లేకపోలేదు. దాంతో, ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరిలో తుది జట్టులో ఆడేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
శ్రీకర్ భరత్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్
ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7 -11 తేదీల్లో టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. ప్రతిష్టాత్మకమైన టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత్, ఆస్ట్రేలియా అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్నాయి. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్ టెస్టు గదపై గురి పెట్టింది.