Nathan Lyon : మరో ఐదు రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC 2023) మొదలవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. అయితే.. ఫైనల్ పోరుపై ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్తో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తమకు చాలా ప్రత్యేకమని అతను అన్నాడు. ‘ఫైనల్లో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ అలాంటింది. మేటి జట్టు భారత్తో టెస్టు గద కోసం పోటీపడడం ఎగ్జైంటింగ్గా అనిపిస్తోంది’ అని లియాన్ తెలిపాడు.
అంతేకాదు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో2-1తో ఓటమిపై కూడా అతను స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫలితం ఇండియాలో ఎదురైన ఓటమిని మరిపించగలదు అని అన్నాడు. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్ టెస్టు గదపై గురి పెట్టింది. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7 -11 తేదీల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు చాంపియన్షిప్ జరగనుంది.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా 2021లో ఫైనల్ చేరింది. కానీ, ఆఖరి మెట్టుపై భంగపడింది. న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. తొలిసారి ఫైనల్ చేరిన ఆసీస్ కూడా విజయంపై కన్నేసింది. స్వదేశంలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 2-1 తో కంగారులను చిత్తు చేసిన రోహిత్ సేన అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందా? లేదా? అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.