IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుకు ఎదురన్నదే లేకుండా పోయింది. మేటి జట్లను సైతం చిత్తుగా ఓడిస్తున్న సంజూ శాంసన్ సేన విజయాల హ్యాట్రిక్ కొట్టింది. అలాగని స్టార్ ఆటగాళ్లు జోష్ బట్లర్(Josh Buttler), యశస్వీ జైస్వాల్(Yashasvi Jiaswal)లు ఇరగదీయడం లేదు. అయినా సరే రాజస్థాన్ జట్టు గెలుపుబాటలో పయనిస్తోందంటే అందుకు కారణం రియాన్ పరాగ్(Riyan Parag). ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ యంగ్ హిట్టర్ ఇప్పటికే రెండు ఫిఫ్టీలు బాదాడు.
మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముకలా నిలుస్తూ.. ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపిస్తున్న పరాగ్ ఈ సీజన్లో ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాడట. అదేంటో తెలుసా..? ‘దేశవాళీ క్రికెట్లో నేను గత ఆరు నెలలుగా చేస్తున్నది ఇదే. బంతిని చూడు. బలంగా కొట్టు ఇదే నా లక్ష్యం. ముంబైతో మ్యాచ్లో బట్లర్ అన్న, అశ్విన్ అన్న ఔటయ్యారు. అప్పుడు నేను చివరిదాకా నిలబడాలి అనుకున్నా’ అని పరాగ్ తెలిపాడు.
గత సీజన్లలో ఆట కంటే యాటిట్యూడ్తో పాపులర్ అయిన పరాగ్.. ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్లో విలువైన ఇన్నింగ్స్లు ఆడున్నాడు. 17వ సీజన్కు ముందు దేశవాళీలో సెంచరీతో రికార్డు నెలకొల్పిన పరాగ్.. మెగా టోర్నీలోనూ అదే ఫామ్తో దుమ్మురేపుతున్నాడు. ప్రతి మ్యాచ్లో నాటౌట్గా నిలుస్తూ రాజస్థాన్ను ఒంతిచేత్తో గెలిపిస్తున్నాడు. సోమవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్పై పరాగ్ 54 నాటౌట్తో హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో, పాండ్యా సేన హ్యాట్రిక్ ఓటమి మూటగట్టుకుంది.
🔙 to🔙 half-centuries for Riyan Parag
He continues his good form with the bat 👏👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR | @rajasthanroyals pic.twitter.com/tAnDaCghYm
— IndianPremierLeague (@IPL) April 1, 2024
పదిహేడో సీజన్లో రాజస్థాన్ ఆడింది మూడు మ్యాచులే. అందులో రెండు ఫిఫ్టీలు బాదేసిన పరాగ్ 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. పరుగుల పరంగా విరాట్ కోహ్లీ(Virat Kohli)తో సమానంగా నిలిచినా.. అత్యధిక స్ట్రయిక్ రేటుతో అతడు ఈ క్యాప్ అందుకున్నాడు. ఇప్పటివరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రన్ మెషిన్ కోహ్లీ 141.40 స్ట్రయిక్ రేటుతో ఆడగా.. పరాగ్ 161. 17 స్ట్రయిక్ రేటుతో చెలరేగిపోతున్నాడు.