టీ20 వరల్డ్కప్ను వరుణుడు వదిలిపెట్టేలా లేడు. అత్యుత్తమ జట్ల మధ్య జరిగే రసవత్తర మ్యాచ్ల కోసం అభిమానులు వేచి చూస్తుంటే.. వర్షం వారి ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు.. ప్రపంచకప్లో ఏకంగా నాలుగు మ్యాచ్లు
వర్షార్పణమయ్యాయి. శుక్రవారం హోరాహోరీ ఖాయమనుకున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పోరు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. వర్షం కారణంగా అఫ్గానిస్థాన్ వరుసగా రెండో మ్యాచ్ కోల్పోయింది.
మెల్బోర్న్: పరుగుల జడివానలో తడిసి ముద్దవ్వాలనుకున్న క్రికెట్ అభిమానులను.. వరుణుడు విసిగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ను నీడలా వెంటాడుతున్న వర్షం శుక్రవారం జరుగాల్సిన రెండు మ్యాచ్లను తుడిచిపెట్టేసింది. మెల్బోర్న్ వేదికగా ఉదయం ప్రారంభం కావాల్సిన అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ పోరు వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రైద్దెంది. పలుమార్లు సమీక్షలు జరిపిన అంపైర్లు ఆట సాధ్యం కాదని నిర్ణయించుకున్నాక మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే మైదానంలో మధ్యాహ్నం జరుగాల్సిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ వరకైనా.. వరుణుడు శాంతిస్తాడేమో అనుకుంటే అదీ సాధ్యపడలేదు. ఆ తర్వాత వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మైదానంలో ఇంత భారీ వర్షం కురవడం తనెప్పుడూ చూడలేదని ఆసీస్ కెప్టెన్ ఫించ్ అన్నాడు.
వర్షం ప్రభావంతో గ్రూప్-1 రేసు రసవత్తరంగా మారింది. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లకు మాత్రమే సెమీస్ చేరే అవకాశం ఉండగా.. గ్రూప్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. దీంతో ఫలితం తేలని మ్యాచ్లు జట్ల భవితవ్యాలను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఒక మ్యాచ్ నెగ్గి.. మరో మ్యాచ్ రద్దవడంతో మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్ టాప్లో ఉండగా.. ఇంగ్లండ్ ఒక మ్యాచ్ నెగ్గి, ఒకటి ఓడి, ఒకటి ఫలితం తేలక మూడు పాయింట్లతో గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ (1 విజయం, 1 ఓటమి, 1 ఫలితం తేలనిది), ఆస్ట్రేలియా (1 విజయం, 1 ఓటమి, 1 ఫలితం తేలనిది) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వీటిలో న్యూజిలాండ్కు మినహా మిగిలిన మూడు జట్లకు గ్రూప్ దశలో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలుండటంతో సెమీస్ రేసుకు పోటీ మరింత ఎక్కువైంది. మరోవైపు అఫ్గానిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్లు ఫలితం తేలకపోవడంతో గ్రూప్లో అట్టడుగున నిలిచింది.