ముల్లాన్పూర్: భారత్, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్పై నమ్మకాన్ని నిలబెడుతూ టీమ్ఇండియా బ్యాటర్లు సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా గిల్(143 బంతుల్లో 103 నాటౌట్, 11 ఫోర్లు, సిక్స్), కేఎల్ రాహుల్(165 బంతుల్లో 100, 11ఫోర్లు) శతక విజృంభణతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. మొదటిసారి ఆతిథ్యమిస్తున్న ముల్లాన్పూర్లో టీమ్ఇండియా బ్యాటర్లు తమదైన శైలిలో పరుగుల వరద పారించారు. గిల్, రాహుల్ సెంచరీలకు తోడు సాయి సుదర్శన్(104 బంతుల్లో 81, 13ఫోర్లు), రిషబ్ పంత్(70 బంతుల్లో 50 నాటౌట్, 2ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ఓపెనర్ జైస్వాల్(24) అంతగా ఆకట్టుకోలేకపోగా, మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచారు. మహమ్మద్ సలీం(2-67) రెండు వికెట్లు తీశాడు.
రాహుల్, గిల్ దూకుడు:
ఆఫ్గన్తో మొదలైన టెస్టు పోరులో టీమ్ఇండియా పైచేయి కనబరుస్తున్నది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే మొదలైన టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్వల్ప స్కోరుకే నిష్ర్కమించాడు. మరో ఎండ్లో రాహుల్ పరిణతి కనబరిచాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఔట్పై డీఆర్ఎస్కు వెళ్లని ఆఫ్గన్ మూల్యం చెల్లించుకున్నది. ఇదే అదనుగా రాహుల్ తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు. కవర్డ్రైవ్ షాట్లకు తోడు ఆన్సైడ్, స్ట్రెయిట్ డ్రైవ్ షాట్లతో బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో సుదర్శన్ నిలకడ ప్రదర్శించాడు.
తన ఇన్నింగ్స్లో 13 ఫోర్లతో ఆకట్టుకున్న సుదర్శన్..సలీమ్ బౌలింగ్లో ఔట్ కావడంతో రెండో వికెట్కు సుదర్శన్తో 139 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అయితే ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్న రాహుల్ ఇన్నింగ్స్ 61వ ఓవర్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ వెంటనే రెహమాన్ బౌలింగ్లో గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ గిల్, రిషబ్ పంత్ అలవోకగా పరుగులు కొల్లగొట్టారు. అప్పటికే అలసిపోయిన ఆఫ్గన్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఓవైపు గిల్ తన కెరీర్లో 11వ సెంచరీ ఖాతాలో వేసుకుంటే..భారీ సిక్స్లతో పంత్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 368-3(గిల్ 103 నాటౌట్, రాహుల్ 100, సలీమ్ 2-67, రెహమాన్ 1-61)