Rahul Dravid : ప్రపంచ క్రికెట్లో పరుగుల రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఈ స్టార్ ఆటగాడు తాజాగా మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. వెస్టిండీస్(Westindies)తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్. దాంతో, ఈ ఫీట్ సాధించిన నాలుగో ఇండియన్ బ్యాటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా ఛేజ్ మాస్టర్ కోహ్లీపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ప్రశంసలు కురిపించాడు.
‘జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ ఆడితే చాలని కలలు కనేవాళ్లు భారత్లో కోకొల్లలు. అలాంటిది కోహ్లీ ఇన్ని మ్యాచ్లు ఆడటమంటే ఆషామాషీ కాదు. . దాని వెనుక విరాట్ కష్టం ఎంతో ఉంది’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. అంతేకాదు మైదానంలో దిగడానికి ముందే కోహ్లీ ఎంతగానో ప్రిపేర్ అవుతాడని మిస్టర్ డిపెండబుల్ చెప్పుకొచ్చాడు.
‘యువ క్రికెటర్లకు కోహ్లీ ఆదర్శం. చాలామంది ఆటగాళ్లు అతడి ఆటను ఇష్టపడతారు. ఎందుకంటే..? అతడు సాధించిన రికార్డులు, ఘనతలు చరిత్రలో చరిస్థాయిగా నిలిచిపోతాయి. ఇవన్నీ సాధించేందుకు అతడు పడ్డ శ్రమ మాత్రం ఎవరికీ తెలియదు. అంతర్జాతీయ క్రికెట్లో 500వ మ్యాచ్ ఆడుతున్నాడంటే.. దాని కోసం అతడు ఎన్ని త్యాగాలు చేశాడో నేను ఊహించగలను. ఇప్పటికీ అతడి ఫిట్నెస్ అమోఘం.. జట్టులోని కుర్రాళ్లతో పోటీగా కష్టపడుతుంటాడు.
విరాట్ కోహ్లీ(87 నాటౌట్)
గత కొంతకాలంగా పరిస్థితులు అనుకూలించక పోయినా వాటిని ఎదురించి నిలిచాడు. అవరోధాలను జయించి ముందుకు సాగుతున్నాడు. వ్యక్తిగతంగా నేను కూడా అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆటపై అతడికున్న అంకిత భావమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది’ అని ద్రవిడ్ తెలిపాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ(87 నాటౌట్) సెంచరీకి చేరువయ్యాడు. ఒకవేళ అతను శతకం బాదితే 500వ మ్యాచ్లో వంద కొట్టిన క్రికెటర్గా రికార్డు సృష్టిస్తాడు.