ముంబై: ఇప్పుడు క్రికెట్లో పరుగులు, సెంచరీల పరంగా టాప్లో ఉండేది ఎవరంటే.. ఠక్కున విరాట్ కోహ్లి లేదంటే రోహిత్ శర్మ పేర్లు చెప్పేస్తారు అభిమానులు. ఇండియన్ టీమ్ తరఫునే కాదు ప్రపంచ క్రికెట్లోనే అత్యంత నిలకడగా, దూకుడుగా ఆడే ప్లేయర్స్ వీళ్లు. సహజంగా టెస్టులైనా, వన్డేలైనా, టీ20లైనా టాప్ స్కోరర్లలో వీళ్లు ముందుంటారు. కానీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో మాత్రం ఈ ఇద్దరు వెనుకబడిపోయారు. ఓవరాల్గా కాదు కదా.. ఇండియన్ టీమ్ తరఫున కూడా వీళ్లు టాప్లో లేరు.
ఆశ్చర్యకరంగా టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. డబ్ల్యూటీసీలో భాగంగా 17 మ్యాచ్లు ఆడిన రహానే 1095 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో 1000 పరుగుల మార్క్ను అందుకున్న మరో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే. అతడు 1030 పరుగులు చేశాడు. ఇక కోహ్లి మాత్రం కేవలం 877 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఓవరాల్గా చూస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్ టాప్లో ఉన్నాడు. అతడు డబ్ల్యూటీసీలో మొత్తం 1675 పరుగులు చేశాడు. ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన లిస్ట్లో రోహిత్ శర్మ టాప్లో లేకపోయినా.. యావరేజ్, నిలకడగా ఆడటంలో మాత్రం అతడు ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో 11 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 64.49 సగటుతో పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అటు కోహ్లి మాత్రం 14 మ్యాచ్లు ఆడి 877 పరుగులు చేశాడు. అతడి సగటు 43.85 మాత్రమే. రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే తన కెరీర్ బెస్ట్ స్కోరు అయిన 254 స్కోరును డబ్ల్యూటీసీలోనే అతను అందుకున్నాడు. 2019లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో కోహ్లి ఈ స్కోరు చేశాడు. ఏడాది కాలంగా సెంచరీ చేయలేకపోయిన విరాట్.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ కరువు తీర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇక డబ్ల్యూటీసీలో ఇండియా తరఫున నాలుగో స్థానంలో మయాంక్ అగర్వాల్ (857 రన్స్), ఐదో స్థానంలో చెటేశ్వర్ పుజారా (818 రన్స్) నిలిచారు.