India Womens Team : సొంతగడ్డపై భారత మహిళల జట్టు విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇంగ్లండ్ను 347 పరుగుల తేడాతో చిత్తు చేసిన హర్మన్ప్రీత్ సేన.. ముంబైలోని వాంఖడేలో ఆస్ట్రేలియా(Australia)ను 8 వికెట్లతో మట్టికరిపించింది. తద్వారా కంగారూలపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అదే ఉత్సాహంతో టీమిండియా.. ఆసీస్తో మూడు వన్డేలు, టీ20 సిరీస్కు సిద్దవుతోంది. దాంతో, సోమవారం బీసీసీఐ 17 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది.
మహిళల ప్రీమియర్ లీగ్(WPL), మహిళల ఏ జట్టు తరఫున అద్భుతంగా రాణించిన శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప, సైకా ఇషాక్, టిటస్ సాధులకు వన్డే, టీ20 సిరీస్ బృందంలో చోటు దక్కింది. డిసెంబర్ 28న తొలి వన్డే జరుగునుంది. ఈ మ్యాచ్తో శ్రేయాంక, ఇషాక్, మన్నత్, సాధులు వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు.
వన్డే స్క్వాడ్ : హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), జెమీమీ రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తికా భాటియా(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటస్ సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ్ రానా, హర్లీన్ డియోల్.
టీ20 స్క్వాడ్ : హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), జెమీమీ రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తికా భాటియా(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటస్ సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి.
ఇంగ్లండ్తో ఈమధ్యే ముగిసిన టీ20 సిరీస్కు మన్నత్ ఎంపికైంది. కానీ, ఈ యంగ్ స్పిన్నర్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. మరోవైపు అండర్ -19 వరల్డ్ కప్ జట్టులో సభ్యురాలైన మన్నత్ వన్డేల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇక డబ్ల్యూపీఎల్ తొలిసీజన్లో ఇషాక్ ముంబై తరఫున అదరగొట్టింది. సంచలన బౌలింగ్తో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమె ఇంగ్లండ్తో టీ20ల్లో తొలిసారి నీలి రంగు జెర్సీ వేసుకుంది.