రాయికోడ్, జూన్ 27 : మండంలోని సింగితం, రాయిపల్లి, నాగన్పల్లి, కర్చల్, మామిడిపల్లి, మొర్టాగా గ్రామాల మీదుగా ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో మట్టి రోడ్డును బీటీరోడ్డుగా మార్చేందుకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక కృషి చేయడంతో ప్రభుత్వం రూ.5.8 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రసుత్తం బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో రహదారులకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా రంగాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నది. ఈ క్రమంలో మట్టి, మెటల్ రోడ్డు ఉన్న గ్రామాలను గుర్తించి బీటీ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. ప్రస్తుతం సింగితం నుంచి మొర్టాగా వరకు 10.44 కిలో మీటర్ల వరకు బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.
సంతోషంగా ఉంది..
నిర్లక్ష్యానికి గురైనా మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రత్యేక కృషితో నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉంది. పనులు ప్రారంభించడంతో పలు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10.44 కిలో మీటర్ల పనులు పూర్తయితే ప్రయాణాలు సాపీగా సాగుతాయి. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
రోడ్డు నిర్మాణంతో మేలు..
సింగితం, నాగన్పల్లి, రాయిపల్లి(సి), కర్చల్, మామిడిపల్లి, మొర్టాగా గ్రామాల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే భయపడేవాళ్లం. ప్ర స్తుతం తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్డు వేసింది. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోడ్డు నిర్మాణంతో మేలు జరుగుతున్నది.