Pujara : బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో రాణించిన ఛతేశ్వర్ పూజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. జట్టులో తిరిగి చోటు సంపాదించిన అతను మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 90, రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు విఫలమైన చోట పూజారా పరుగులు సాధించాడు. బంగ్లాపై పరుగులు చేయడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడడమే కారణమని అతను వెల్లడించాడు. ‘కొన్నిసార్లు టెస్టు మ్యాచ్ల మధ్య సరిపోను సమయం ఉంటుంది. అది మానసికంగా సిద్ధమవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఒక ఆటగాడు మెరుగవడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ చాలా ముఖ్యం. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత తీవ్రంగా శ్రమించాను. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చాలా మ్యాచ్లు ఆడాను. అందుకనే బంగ్లాపై రన్స్ చేయగలిగాను’ అని పూజారా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది మొదట్లో ఫామ్ కోల్పోయిన పూజారాకు జట్టులో చోటు దొరకడమే గగనమైంది. వరుసగా విఫలం అవుతున్న అతడిని స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్కు ఎంపిక చేయలేదు. దాంతో, పూజారా తన గేమ్ మీద బాగా దృష్టి పెట్టాడు. కౌంటీల్లో సస్సెక్స్ జట్టు తరఫున పరుగుల వరద పారించాడు. 8 మ్యాచుల్లో 614 రన్స్ స్కోర్ చేశాడు. ఫామ్ అందిపుచ్చుకోవడంతో మళ్లీ టెస్టు జట్టుకి ఎంపికయ్యాడు. తాను ఎంత ముఖ్యమైన ఆటగాడినో చాటుతూ మొదటి టెస్టులో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ సెంచరీ కొట్టాడు.