Pakistan Cricket : వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అవకతవకలు జరిగాయనే వార్తలు పాకిస్థాన్ క్రికెట్(Pakistan Cricket)లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దాంతో, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతలోనే దాయాది క్రికెట్లో మరో మరో వివాదం రాజుకుంది. 1993 విండీస్ పర్యటనలో మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్.. జావేద్ మియాందాద్ను చెంప దెబ్బ కొట్టాడని పర్వేజ్ జమాల్ మిర్ బాంబు పేల్చాడు.
‘అంటిగ్వాలో డ్రెస్సింగ్ రూమ్లో లతీఫ్, మియాందాద్ మధ్య గొడవ జరిగింది. దాంతో కోపంతో ఊగిపోయిన లతీప్.. మియాందాద్పై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో గొడవ పెద్దది చేయొద్దని మియాందాద్కు నచ్చజెప్పాను’ అని పర్వేజ్ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే.. అతడి వార్తల్ని లతీఫ్తో పాటు మియాందాద్ ఖండించారు. నా జీవితంలో నేను ఎవరిపై చేయి చేసుకోలేదు. దేశ ప్రజలకు పర్వేజ్ చెప్తున్న కట్టు కథను, అవాస్తవాలకు చెక్ పెట్టాలి. అందుకని అతడికి లీగల్ నోటీసులు పంపిస్తాను అని లతీఫ్ పేర్కొన్నాడు.
మియాందాద్ చెంప దెబ్బ సంఘటన ఏమోగానీ.. ఆ పర్యటన పాక్ క్రికెట్ను కుదిపేసింది. ఏకంగా నలుగురు క్రికెటర్లు నిషేధిత డ్రగ్ మరిజానా తీసుకుంటూ పట్టుబడ్డారు. గయానాలో మత్తుపదార్థాలతో దొరికిపోయిన వసీం అక్రమ్, వకార్ యూనిస్, ముస్తాక్ అహ్మద్, ఆఖిబ్ జావేద్లను పోలీసులు అరెస్ట్ చేశారు.