Bodhan | (బోధన్, నమస్తే తెలంగాణ) బహుభాషలు, వివిధ సంస్కృతుల సమ్మేళనంతో మినీ ఇండియాగా కనిపించే బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో షకీల్ విజయం సాధించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారు.
రూ.500 కోట్లతో రోడ్ల విస్తరణ
బోధన్ నియోజకవర్గంలో. సుమారు రూ. 500 కోట్లతో రోడ్ల విస్తరణ, భవనాలు, వంతెనల నిర్మాణ పనులను చేపట్టారు. బోధన్ నుంచి సాలూర చెక్పోస్ట్ వరకు ఉన్న అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిని రూ.10 కోట్లతో ఫోర్లేన్ గా విస్తరించారు. బోధన్ బైపాస్ రోడ్డును రూ.10 కోట్లతో ఆధునీకరించారు. బోధన్ నుంచి మోస్రా రోడ్డు, పెగడాపల్లి నుంచి ఫకీరాబాద్ రోడ్డు… ఇలా అనేక ప్రధాన రహదారులను ఆధునీకరించారు. లోలెవల్ వంతెనలతో ఎదురవుతున్న ఇబ్బందులను గమనించి హై లెవల్కు మార్చారు. రెంజల్ వద్ద మొండివాగు, బోర్గాం, బ్రాహ్మణ్పల్లి, నవీపేట్ మండలంలోని జన్నేపల్లి, బోధన్ మండలంలోని కొప్పర్గ తదితర వంతెనలను నిర్మించారు. జాన్కంపేట్ నుంచి బాసర వరకు రూ.50 కోట్లతో రోడ్డును విస్తరించారు.
ఆయకట్టుకు సాగునీరు..
రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.77 కోట్లతో నిజాంసాగర్ కాల్వలను ఆధునీకరించారు. దీంతో చివరి ఆయకట్టు వరకూ నీరు అందుతున్నది. భూగర్భ జలాలు పెరిగేందుకు రూ.26 కోట్లతో ఆరు చెక్డ్యాంలను నిర్మించారు. ‘మిషన్ కాకతీయ’ కింద రూ.60 కోట్లతో చెరువులల్లో పూడికను తీసి కట్టలను బలోపేతం చేశారు.
సంక్షేమ పథకాల అమలులోనూ షకీల్ తనదైన ముద్ర వేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 2016-17 నుంచి ఇప్పటి వరకు 11,596 కుటుంబాలకు ప్రయోజనం కల్పించారు.
వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపర్చడానికి ఎమ్మెల్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చారు. బోధన్లోని కమ్యూనిటీ దవాఖానను 250 పడకలకు విస్తరించారు.
పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు బోధన్లో ఆరు గురుకులాలను ఏర్పాటు చేయించారు. పలు పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయించారు. బోధన్, రెంజల్, అమ్దాపూర్లల్లో జ్యోతిరావు బాఫూలే బాలికల పాఠశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని రూ.6 కోట్లతో ఆధునీకరించారు. రూ.3.5 కోట్లతో నవీపేట్లో పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించారు.