Kely Nascimento : ఫుట్బాల్ చరిత్రలో పీలె ఎంత గొప్ప ఆటగాడో తెలిసిందే. తన ఆటతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం పొందిన ఆయన 2022 డిసెంబర్ 29న కన్నుమూశారు. అయితే.. చివరి దశలో అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా కూడా ఆటను ఆస్వాదించాడని ఆయన కూతురు కెలీ నసిమెంటో చెప్పింది. తన తండ్రి గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. పోయిన ఏడాది ఖతర్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని లియోనల్ మెస్సీ అందుకోవాలని పీలె అనుకున్నాడని ఆమె చెప్పింది. ‘మెస్సీ గెలుస్తాడు’ అని నాన్న అనేవాడు. అయితే.. ఆయన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను టీవీలో చూడలేదు. అయినా కూడా మెస్సీ ఫిఫా ట్రోఫీ అందుకున్నాడనే వార్త తెలిశాక చాలా సంతోషించాడు’ అని ఆమె వెల్లడించింది.
వరల్డ్ కప్ టోర్నీ నుంచి బ్రెజిల్ నాకౌట్ అయిన తర్వాత అర్జెంటీనా కప్పు కొట్టాలని పీలే భావించాడట. రెండు రోజుల క్రితం ప్యారిస్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ అవార్డు వేడులకు నసిమెంటో హాజరైంది. అక్కడ ఆమె మెస్సీ భార్య ఆంటోనెలా రొకుజోను కలిసింది.
బ్రెజిల్ దిగ్గజ ఫుట్బాలర్ అయిన పీలె అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డొ మసినెంటో. అయితే పీలెగా అతను ప్రపంచ ఖ్యాతి గడించాడు. 17 ఏళ్ల వయసులోనూ ఆరంగేట్రం చేశాడు. 1958 వరల్డ్ కప్లో హ్యాట్రిక్ గోల్స్ చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిశాడు. అయితే.. పెద్ద పేగు క్యాన్సర్ రావడంతో 2021లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయినా కూడా క్యాన్సర్ తగ్గలేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో నవంబర్లో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. 2022 డిసెంబర్ 29న కన్నుమూశాడు. అతని మూడుసార్లు (1958, 1962, 1970) బ్రెజిల్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించడంలో ఆయన పాత్ర ఉంది.
ఖతర్ ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని అర్జెంటీనా ఎగరేసుకుపోయింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్ను ఓడించింది. ఎంబాపే హ్యాట్రిక గోల్స్ చేసినా మ్యాచ్ గెలిపించలేకపోయాడు. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ రెండు గోల్స్తో జట్టును గెలిపించాడు. ఎంబాపేకు గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినేజ్ గోల్డెన్ గ్లోవ్ అందుకున్నాడు.