అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేసి ఆటకు గుడ్ బై చెప్పిన ఆటగాళ్లను మైదానంలో మళ్లీ చూడాలని చాలామంది అభిమానులు అనుకుంటారు. హిట్టర్ల బ్యాటింగ్ విన్యాసాలు, బౌలర్ల ప్రదర్శనను మరొకసారి కళ్లారా చూడాలని ఆశ పడతారు. ఆటకు వీడ్కోలు పలికిన మజీ క్రికెటర్లు గౌతం గంభీర్ (భారత్), అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), షాహిద్ ఆఫ్రీది (పాకిస్థాన్)లు మళ్లీ గ్రౌండ్లోకి దిగనున్నారు. ఈ లెజెండరీ ప్లేయర్స్ మరోసారి తమ పవర్ హిట్టింగ్తో ఫ్యాన్స్ను అలరించనున్నారు.
మార్చి 10న ఖతర్లో జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఈ ముగ్గురు ఆడనున్నారు. అది కూడా కెప్టెన్లుగా బరిలోకి దిగనున్నారు. ఇండియా మహరాజ్ జట్టు కెప్టెన్గా గంభీర్, వరల్డ్ జెయింట్స్ టీమ్ కెప్టెన్గా ఫించ్, ఆసియా లయన్స్కు ఆఫ్రీది కెప్టెన్గా ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్లు పాల్గొంటున్న ఈ లీగ్ మార్చి 10 నుంచి మార్చి 20 వరకు జరుగుతుంది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఆడేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వాళ్లలో టీమిండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప ఉన్నారు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్, శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, మహమ్మద్ హఫీజ్ (పాకిస్థాన్) కూడా ఈ లీగ్లో ఆడుతున్నారు.
లెజెండరీ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)లో ఇండియా మహరాజ్ కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల గౌతం గంభీర్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘లెజెండరీ లీగ్ క్రికెట్తో చాలా కాలంగా కొనసాగుతున్నా. ఆసక్తికరమైన ఇలాంటి టోర్నమెంట్లో ఆడడం చాలా సంతోషంగా ఉంది. మళ్లీ మైదానంలో దిగడమే కాకుండా ఒకప్పటి స్నేహితులను కలవడానికి ఉపయోగపడుతుంది. ఇండియా మహరాజ్ జట్టు సభ్యులతో కలిసి నేను జాతీయ జట్టుకు, దేశవాళీలో ఆడాను. కెప్టెన్గా అద్భుతమైన క్రికెట్ ఆడతానని అభిమానులకు మాట ఇస్తున్నా’ అని గంభీర్ తెలిపాడు.
టీమిండియా వైస్ కెప్టెన్గా వ్యవహరించిన గంభీర్ ఓపెనర్గా సెహ్వాగ్తో కలిసి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడాడు. అంతేకాదు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును నడిపించాడు కూడా. మాజీ ఆల్రౌండర్ షాహీద్ ఆఫ్రీది ప్రస్తుతం పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్గా ఉన్నాడు. ఆసీస్కు పొట్టి ప్రపంచ కప్ అందించిన అరోన్ ఫించ్ విధ్వంసక ఓపెనర్లలో ఒకడు. ఈ మధ్యే అతను క్రికెట్కు అల్విదా చెప్పిన విషయం తెలిసిందే.