IND vs AUS : మూడో టెస్టు రెండో రోజు పలు రికార్డులు బద్ధలయ్యాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో నాథన్ లయాన్ చెలరేగిపోయాడు. ఎనిమిది వికెట్లు తీసి భారత్ను గట్టి దెబ్బకొట్టాడు. నయావాల్ ఛటేశ్వర్ పూజారా ఒక్కడే నిలబడ్డాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా ఓపికగా ఆడిన అతను హాఫ్ సెంచరీ(59)తో ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 163 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ ముందు 76 రన్స్ టార్గెట్ ఉంచింది. రికార్డులు బ్రేక్ అయిన రెండో రోజు ఆట హైలెట్స్ ఏంటో చూద్దాం..
100 వికెట్ల క్లబ్లో ఉమేశ్- భారత పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. స్వదేశంలో వంద వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్గా అతను రికార్డు క్రియేట్ చేశాడు. రెండో రోజు ఐదు ఓవర్లు వేసిన ఉమేశ్ 12 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
మురళీధరన్ను దాటేసిన లయాన్ – ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఎనమిది వికెట్ల ప్రదర్శనతో భారత్ను దెబ్బ తీశాడు. దాంతో, టీమిండియాపై ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ను అతను వెనక్కి నెట్టాడు.
పూజారా 13 సార్లు – రెండో ఇన్నింగ్స్లో ఛటేశ్వర్ పూజారాను ఔట్ చేసి లయాన్ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 13 సార్లు పూజారా అతని బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దాంతో లయాన్ బౌలింగ్లో ఎక్కువ సార్లు ఔటైన భారత బ్యాటర్గా పూజారా రికార్డుల్లోకి ఎక్కాడు. అజింక్య రహానేను 10 సార్లు, రోహిత్ శర్మను 8 సార్లు, విరాట్ కోహ్లీని 7 సార్లు ఈ ఆసీస్ స్పిన్నర్ పెవిలియన్కు పంపాడు.
రిచీ బెనౌడ్స్ రికార్డు సమం – భారత గడ్డపై లయాను ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. దాంతో అతను ఆసీస్ మాజీ బౌలర్ రిచీ బెనౌడ్స్ సరసన చేరాడు. ఇప్పటివరకు లయాన్ 9 సార్లు టీమిండియాపై ఈ ఫీట్ సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో లయాన్ 8 వికెట్లు తీశాడు.
జడ్డూ ఇదే ఫస్ట్ – టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 2019 జనవరి నుంచి రెండంకెల స్కోర్ చేయకుండా ఔట్ కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అతను రెండు సార్లు మాత్రమే 10 లోపు వికెట్ సమర్పించుకున్నాడు.
రెండోసారి మాత్రమే – 1978 నుంచిటెస్టుల్లో భారత జట్టు 200 పరుగుల లోపే ఆలౌట్ కావడం ఇది రెండోసారి. అంతేకాదు రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ ఓవర్లు (93.5) బ్యాటింగ్ చేయడం కూడా ఇది రెండోసారి మాత్రమే.
ఇండోర్ టెస్టులో నాథన్ లయాన్ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యధికంగా 5 వికెట్లు తీసి నాలుగో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో దివంగత, దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అతను 37 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మెక్గ్రాత్ (29 సార్లు) రెండో స్థానంలో, డెన్నిస్ లిల్లీ (23 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. అంతేకాదు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్గా లయాన్ గుర్తింపు సాధించాడు. భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (10) మొదటి స్థానంలో ఉన్నాడు.
రెండో ఇన్నింగ్స్లో పూజారా అడ్డు గోడలా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. కునేమాన్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులకు చేరువయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను జడేజా (7), శ్రేయాస్ అయ్యర్(26)తో కలిసి స్కోర్బోర్డును ముందుకు నడిపించాడు. టీ బ్రేక్ సమయానికి ఇండియా 79/4 ఉంది. అయితే.. స్టీవ్ స్మిత్ ఫీల్డర్లను మోహరించి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. దాంతో జడేజా, అయ్యర్ భారీ షాట్లు ఆడలేక పోయారు. డిఫెన్స్ ఆడే క్రమంలో వాళ్లు త్వరగా ఔటయ్యారు. లెగ్ స్లిప్లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో పూజారా (59) మారథాన్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో అశ్విన్ (16), అక్షర్ పటేల్ (15) పర్వాలేదనిపించారు.