PCB : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీని ఆదివారం రద్దు చేసింది. లాహోర్లో శుక్రవారం పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi), మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలని మొహ్సిన్ ప్రతిపాదించగా.. ఇటీవలే ముగసిన పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2024)లో ఆడిన ఆటగాళ్ల ప్రదర్శనపై రియాజ్ పూర్తిస్థాయి నివేదిక సమర్పించాడు.
అనంతరం నఖ్వీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగతున్న సెలెక్షన్ కమిటీని రద్దు చేస్తున్నాం. కొత్త కమిటీని త్వరలోనే ప్రకటిస్తాం అని వెల్లడించాడు. ఈమధ్యే పీసీబీ ఏడుగురు సభ్యుల సెలెక్షణ్ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మాజీ ఆటగాళ్లు అబ్దుల్ రజాక్, అసద్ షఫీక్, మహమ్మద్ యూసుఫ్, వాహబ్ రియాజ్, కెప్టెన్, హెడ్కోచ్, డేటా అనలిస్ట్లకు చోటు దక్కింది. అయితే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లో పాక్ జట్టు చెత్త ఆటతో నిరాశపరిచింది. దాంతో, సెలక్షన్ కమిటీపై వేటు వేయాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించుకున్నాడు.
Chairman PCB Mohsin Naqvi’s press conference at Gaddafi Stadium, Lahore.
Watch Live ➡️ https://t.co/qqyiz5eboY pic.twitter.com/ljB3RnYI2L
— Pakistan Cricket (@TheRealPCB) March 24, 2024
నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ జట్టు చెత్త ప్రదర్శనతో సెమీస్ ముందే ఇంటిదారి పట్టింది. అప్పటి నుంచి, పీసీబీలో పలు మార్పులు జరిగాయి. నజం సేథి స్థానంలో జకా అష్రఫ్ పగ్గాలు చేపట్టాడు. వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఇంజమామ్ ఉల్ హక్ చీఫ్ సెలెక్షర్ పదవికి రాజీనామా చేశాడు. అనంతరం బాబర్ ఆజాంను కెప్టెన్గా తప్పించి, షాహీన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది.
అంతేకాదు విదేశీ హెడ్కోచ్ మికీ ఆర్థర్ను తప్పించారు. డోపింగ్ నిందితుడు సల్మాన్ భట్ను సెలెక్షన్ కమిటీలోకి తీసుకొని పీసీబీ విమర్శల పాలైంది. ఆ తర్వాత పాక్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో మొహ్సిన్ నఖ్వీ పీసీబీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికా గడ్డపై టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. జూన్ 9వ తేదీన న్యూయార్క్లో భారత్, పాక్లు తలపడనున్నాయి.