ODI WC | ఈ ఏడాది ఆసియా కప్ (Asia Cup)కు పాక్ (Pak) ఆతిథ్యం ఇవ్వనున్నది. మరో వైపు ఐసీసీ మెగాటోర్నీ అయిన వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ క్రమంలో భారత్ – పాక్ల మధ్య కొంతకాలంగా టోర్నీల మాటల తూటాలు పేలుతున్నాయి. ఆసియా కప్ సెప్టెంబర్లో పాక్ నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో భారత జట్టును పాక్కు పంపేది లేదని, తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా జట్టును పాక్కు పంపడం సాధ్యం కాదని పేర్కొంటున్నది.
అయితే, ఈ ఏడాది అక్టోబర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో తాము పాల్గొనబోమని పీసీబీ అంటున్నది. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ కప్ కోసం పాక్ జట్టును భారత్కు పంపే విషయంలో బీసీసీఐకి పీసీబీ షరతులు విధించింది. 2025లో పాక్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా పాల్గొంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని, అప్పుడు పాక్ జట్టును భారత్కు పంపుతామని చెప్పినట్లు పీసీబీ చైర్మన్ నజామ్ సేథి స్పష్టం చేసినట్లు సమాచారం. మరో వైపు పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్లో టీమిండియా ఆడే మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలన్న ‘హైబ్రిడ్ మోడల్’కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు జై షా ఇంకా ఆమోదం తెలుపలేదు.
టోర్నీ మొత్తాన్ని తటస్థ వేదికపైనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తున్నది. ఈ క్రమంలో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ విషయంలో సేథి ఏసీసీ, ఐసీసీ అధికారులపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారని సమాచారం. ఇందు కోసం ఆయన ఈ నెల 8న దుబాయికి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఆసియా కప్ను పాక్లో నిర్వహించకపోయినా, హైబ్రిడ్ మోడల్కు అంగీకరించకపోయినా ఆ టోర్నీలో పాక్ ఆడబోదని స్పష్టం ఐసీసీకి స్పష్టం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో 2025 చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు బీసీసీఐ హామీ ఇవ్వాలని సేథి పట్టుబడుతున్నారని తెలిపాయి.