Parthiv Patel : స్వదేశంలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన చేజేతులా ఓడిపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కెప్టెన్ రోహిత్ బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఉప్పల్ టెస్టులో పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj)కు ఏడు ఓవర్లు మాత్రమే ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత మైదానంలో హైదరాబాదీ పేసర్కు ఏడు ఓవర్లే ఇస్తారా? అని మాజీ క్రికెటర్ పార్టీవ్ పటేల్(Parthiv Patel) టీమిండియా మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు.
‘ఒక బౌలర్కు ఏడు ఓవర్లు మాత్రమే ఇచ్చినప్పుడు అతడిని ఆడించడంలో అర్థం లేదు. సిరాజ్ను ఉపయోగించుకోవడం తెలియనప్పుడు అతడిని ఎందుకు తీసుకున్నాడు. సిరాజ్ బదులు అదనపు బ్యాటర్ను తీసుకోవాల్సింది’ అని పార్టీవ్ పటేల్ అన్నాడు. ఐపీఎల్(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుకు ఆడిన పార్టీవ్ ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు.
ఆసియాకప్, వన్డే వరల్డ్ కప్లో నిలకడగా రాణించిన సిరాజ్.. దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)లో సంచలన బౌలింగ్ ఆకట్టుకున్నాడు. కేప్టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో సఫారీల నడ్డివిరిచాడు. దాంతో, టీమిండియా న్యూలాండ్స్(Newlands)లో చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. అలాంటిది ఇంగ్లండ్తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో అతడికి 11 ఓవర్లు ఇచ్చారంతే. ఈ పేసర్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు, రెండో ఇన్నింగ్స్ల్లో 7 ఓవర్లు మాత్రమే వేశాడు.
మొత్తం 11 ఓవర్లలో సిరాజ్ వికెట్ తీయకుండా 50 పరుగులు ఇచ్చాడు. పిచ్ స్పిన్కు అనుకూలించడంతో రెండో ఇన్నింగ్స్లో అశ్వన్, జడేజా, అక్షర్ పటేల్లకే రోహిత్ శర్మ ఎక్కువసార్లు బంతి అందించాడు. అయినప్పటికీ ఓలీ పోప్ వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్ 420 రన్స్ కొట్టింది. అనంతరం 231 పరుగుల ఛేదనలో టీమిండియాను అరంగేట్రం స్పిన్నర్ టామ్ హర్ట్లే (Tom Hurtley)దెబ్బకొట్టాడు. ఈ యువ కెరటం టాపార్డర్తో పాటు మిడిలార్డర్ను కూల్చడంతో 28 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. సిరీస్లో కీలకమైన రెండో టెస్టు ఫిబ్రవరి 2న వైజాగ్లో జరుగనుంది.