న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు (Hemant Soren) చెందిన బీఎండబ్ల్యూ కారుతోపాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు ఆయన ఆచూకీ తెలియలేదు. దీంతో ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సొరేన్కు ఇప్పటికే ఈడీ ఏడుసార్లు సమన్లు జారీచేయగా.. ఆయన హాజరుకాలేదు.
అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఈడీ అధికారులకు పంపిన ఈ-మెయిల్లో, జనవరి 31న మధ్యాహ్నం 1 గంటకు సొరేన్ను రాంచీలోని ఆయన నివాసంలో ప్రశ్నించవచ్చునని తెలిపారు. ప్రభుత్వ భూముల యాజమాన్యం మార్పు కుంభకోణంలో రూ.600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఇదిలావుండగా, సొరేన్ కోసం ఈడీ అధికారులు సోమవారం జార్ఖండ్ భవన్కు, మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని సొరేన్ తండ్రి నివాసానికి వెళ్లారు. కానీ ఆయన ఈ రెండు చోట్ల లేరు. ఆయన చార్టర్డ్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉంది. కొందరు ఈడీ అధికారులు సోమవారం రాత్రి వరకు ఆయన నివాసం వెలుపల తిష్ఠ వేశారు. అయితే ఇప్పటివరకు ఆయన ఆచూకీ లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.