న్యూఢిల్లీ/డెహ్రాడూన్: భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. తన తల్లిని కలుసుకునేందుకు సొంత ఊరు రూర్కీకి వెళుతున్న క్రమంలో మాంగ్లౌర్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఓ వైపు కనూచూపు మేరలో దట్టమైన పొగమంచు కమ్ముకున్న వేళ కునికిపాటుకు గురైన పంత్ క్షణకాలంలో ప్రమాదం బారిన పడ్డాడు. గంటకు 120కి.మీ వేగంతో ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారు రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొడుతూ దాదాపు 200మీటర్ల దూరం వరకు పల్టీల కొట్టింది.
కొద్దిసేపటి తర్వాత మంటలు అంటుకుని అగ్నికి పూర్తిగా ఆహుతి అయ్యింది. ఆ సమయంలో ఆటు వైపు నుంచి వెళుతున్న ట్రక్ డ్రైవర్ వెంటనే స్పందించి కారు అద్దలు పగులగొట్టి పంత్ను కారులో నుంచి బయటికి తీసినట్లు స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు. తలకు బలంగా దెబ్బలు తగలడంతో రక్తమోడుతున్న పంత్ను తొలుత దగ్గరలోని దవాఖానకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన మెరుగైన చికిత్స కోసం రూర్కీలోని సాక్షమ్ హాస్పిటల్కు మార్చినట్లు అధికారులు తెలిపారు.
పంత్ను క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు ఎమ్ఆర్ఐ స్కానింగ్ పరీక్షల తర్వాత ప్రమాదం ఏమి లేదని వెల్లడించారు. విషయం తెలుసుకున్న పంత్ తల్లితో పాటు కుటుంబసభ్యులు దవాఖానకు తరలివచ్చారు.
పంత్కు నుదురుతో పాటు కుడి మెకాలిలో చీలిక కుడి చేయి, మడమ, వెన్ను భాగంలో గాయాలు అయినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. పంత్కు అయ్యే వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి తెలిపారు.
మెరుగైన వైద్య సేవలకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన పంత్ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్, సురేశ్ రైనా, రికీ పాంటింగ్, ధవన్, షాహిన్ షా అఫ్రిదీ, బెయిర్స్టో, జులన్ గోస్వామి తదితరులు ట్విటర్లో సందేశాలు రాసుకొచ్చారు.