టోక్యో: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రపంచ క్రీడా పండుగ టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకుల్లేకుండా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్లో కొత్త కేసులు పెరుగుతుండడంతో జూలై 23 నుంచి జరుగాల్సిన విశ్వక్రీడలు ఖాళీ స్టేడియాల్లో సాగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించబోమని ప్రకటించిన నిర్వాహకులు జపనీయుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్రేక్షకులు లేని ఒలింపిక్స్ కోసం సిద్ధపడాలని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) అధ్యక్షుడు సెబాస్టియన్ కోయ్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ జరుపకూడదని దాదాపు రెండున్నర లక్షల మంది జపాన్వాసులు ఆన్లైన్ పిటిషన్ను సమర్థించగా.. విశ్వక్రీడలను సురక్షితంగా నిర్వహిస్తామని ఆ దేశ ప్రధాని యోషిహిండే సుగా స్పష్టం చేశారు.