కరోనా ప్రళయం కొనసాగుతున్న వేళ.. ఇప్పటికే ఓసారి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్ క్రీడలపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జపాన్లోని 80 శాతం మంది ప్రజలు విశ్వక్రీడల నిర్వహణను వ్యతిరేకిస్తుంటే.. ప్రపంచానికి బలమైన సందేశం ఇవ్వాలంటే ఒలింపిక్స్ జరిపి తీరాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఒలింపిక్స్పై స్పష్టతనివ్వాలని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ అంటుంటే.. ప్రాణాలకంటే ఆటలు ముఖ్యం కాదని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు అభిప్రాయపడింది. ఒలింపిక్స్ నిర్వహించినా.. నిర్వహించకపోయినా వైరస్ ముప్పు పొంచే ఉంటుందని ఐవోఏ సంయుక్త కార్యదర్శి పేర్కొన్న నేపథ్యంలో విశ్వక్రీడలపై ప్రత్యేక కథనం..
నాలుగేండ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడలు.. ప్రపంచ యుద్ధాల అనంతరం ఎడతెరపి లేకుండా కొనసాగుతూ వస్తున్నాయి. కంటికి కనిపించని క్రిమి విజృంభణతో టోక్యో వేదికగా గతేడాదే జరుగాల్సిన విశ్వక్రీడలు ఈ సంవత్సరానికి వాయిదా పడ్డాయి. అంతా అనుకూలంగానే ఉంది ఈ సారి (జూలై 23-ఆగస్టు 8) క్రీడలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకావనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ రెండోసారి తన తడాఖా చూపుతున్నది. దీంతో పలు క్రీడా విభాగాల్లో ఒలింపిక్స్ అర్హత టోర్నీలు రద్దు కాగా.. చాలా వరకు వాయిదాల బాటపట్టాయి. ఇలాంటి తరుణంలో విశ్వక్రీడలు జరుపడం అవసరమా అని జపాన్ వాసులు గగ్గోలు పెడుతుంటే.. ఐవోఏ మాత్రం ప్రపంచానికి బలమైన సందేశం ఇవ్వాలంటే క్రీడలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.
ప్రేక్షకులు లేకున్నా ఇబ్బందే
కొవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచానికి విశ్వక్రీడలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోగా.. స్థానికులకు కూడా ఒలింపిక్స్ భాగ్యం దక్కే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పూర్తి బయోబబుల్లో ఆటలు నిర్వహించినా.. వైరస్ దరిచేరదనే నమ్మకం లేకపోవడంతో నిర్వహకుల్లోనూ ఒకింత ఆందోళన కనిపిస్తున్నది. భారత్లో ఇటీవల అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్-14వ సీజన్ విషయానికి వస్తే.. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, అంపైర్లను బయోబబుల్లో ఉంచినా.. గ్రౌండ్ స్టాఫ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో లీగ్ను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అలాంటిది ఒలింపిక్స్ వంటి మెగాటోర్నీలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వైరస్ ముప్పు పొంచే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
80% మంది నిరాసక్తత
కష్టకాలంలో క్రీడల నిర్వహణ సరైంది కాదని జపాన్లోని 80 శాతం మంది ప్రజలు భావిస్తున్నారని సోమవారం ఓ సర్వే వెల్లడించింది. ప్రమాదకర వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్ను వాయిదా వేయాలని 40 శాతం జపాన్ వాసులు అంటుంటే.. 43 శాతం మంది రద్దు చేయడమే మంచిదని పేర్కొన్నారు. 14 శాతం మంది మాత్రమే షెడ్యూల్ ప్రకారం విశ్వక్రీడలు నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ సర్వేలో ప్రేక్షకులను అనుమతించకూడదని 59 శాతం మంది పేర్కొంటే.. 33 శాతం మంది మాత్రం పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించాలని వెల్లడించారు.
ఒలింపిక్స్ జరుగాలి: సంజీవ్
టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం జరుగాలని.. వాటి కోసం తామంతా కష్టపడుతున్నామని భారత వెటరన్ షూటర్ సంజీవ్ రాజ్పూత్ పేర్కొన్నాడు. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో పోటీపడుతున్న సంజీవ్.. ప్రస్తుతం యూరోపియన్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు క్రొయేషియా వెళ్లాడు. విశ్వక్రీడల కోసం భారత షూటర్లు కఠోరంగా సాధన చేస్తున్నారని.. వారి శ్రమకు ఫలితం దక్కాలంటే టోక్యో ఒలింపిక్స్ జరుగాలని సంజీవ్ పేర్కొన్నాడు.