ODI World Cup | వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంక – ఆస్ట్రేలియా మధ్య లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించినా మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టు.. 43.3 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమైంది. కొంతసేపు వర్షం అంతరాయం కలిగించిన లంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు పతుమ్ నిస్సంక (67 బంతుల్లో 61, 8 ఫోర్లు), కుశాల్ పెరీరా (82 బంతుల్లో 78, 12 ఫోర్లు) తొలి వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆ జోరు కొనసాగించలేకపోయారు. ఆసీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చిన లంకకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. నిస్సంక, పెరీరా కంగారూ బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కోవడమే గాక రన్ రేట్ ఆరుకు పడిపోకుండా చూసుకున్నారు. ఓపెనర్లిద్దరూ అర్థ సెంచరీలు సాధించిన తర్వాత నిస్సంకను 21.4 ఓవర్లో కమిన్స్ ఔట్ చేయడంతో లంక జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే పెరీరానూ కమిన్స్ బౌల్డ్ చేశాడు. గత రెండు మ్యాచ్లలో భీకర ఇన్నింగ్స్లు ఆడిన కుశాల్ మెండిస్ (9) నేటి మ్యాచ్లో తేలిపోయాడు. సమరవిక్రమ (8), ధనంజయ డిసిల్వ (7), చమిక కరుణరత్నె (2), దునిత్ వెల్లలాగె (2)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. చరిత్ అసలంక (25) పోరాడటంతో లంక స్కోరు రెండు వందలు దాటింది.
Starc strikes 💥
This Mitchell Starc wicket is one of the moments that could be featured in your @0xFanCraze Crictos Collectible packs!
Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #CWC23 pic.twitter.com/aI9POcH8Iu
— ICC (@ICC) October 16, 2023
మొదటి 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కంగారూ బౌలర్లు తర్వాత పుంజుకున్నారు. నిస్సంకను ఔట్ చేసిన తర్వాత లంకను కోలుకోనీయలేదు. స్పిన్నర్ ఆడమ్ జంపా.. కుశాల్తో పాటు సమరవిక్రమ, కరుణరత్నె, తీక్షణ పనిపట్టాడు. స్టార్క్ కూడా డిసిల్వను ఔట్ చేసి లంకను దెబ్బకొట్టాడు. స్పిన్కు అనుకూలిస్తున్న లక్నో పిచ్పై ఈ తక్కువ లక్ష్యాన్ని లంకేయులు ఏ మేరకు కాపాడుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.