NZ vs ENG : వెల్లింగ్టన్ టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్పై గెలుపొందింది. రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. దాంతో, ఫాలో ఆన్ ఆడిన తర్వాత మ్యాచ్ గెలిచిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆఖరి రోజు కివీస్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ చెలరేగడంతో ఇంగ్లండ్ కుప్పకూలింది. అతని బౌలింగ్ ధాటికి ఆ జట్టు బాజ్బాల్ టెక్నిక్ పనిచేయలేదు.
తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన జో రూట్ (95) ఒక్కడే ప్రతిఘటించాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 256 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో వాగ్నర్ నాలుగు, సౌథీ మూడు, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీశారు. శతకంతో మెరిసిన విలియమ్సన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఈ సిరీస్లో అదరగొట్టిన హ్యారీ బ్రూక్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
దాదాపు ఓటమి ఖాయం అనుకున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుతం చేసింది. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ 209 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 435-8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. హ్యారీ బ్రూక్ (186), జో రూట్(153) శతకాలతో చెలరేగరు. అయితే.. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ ధీటుగా బదులిచ్చింది. కేన్ విలియమ్సన్ సెంచరీ, లాథమ్ (83), వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (90) అర్ధ శతకాలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు 483 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్నైట్ స్కోర్ 48తో ఉన్న ఇంగ్లండ్ను వాగ్నర్ దెబ్బతీశాడు. బౌన్సర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. దాంతో, ఐదో రోజు ఆ జట్టు ఆలౌట్ అయింది. దాంతో 2017 తర్వాత కివీస్ గడ్డపై సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డు తిరగరాయాలనుకున్న ఇంగ్లండ్ కల కలగానే మిగిలింది.
రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయాన్ని మరో అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకుంటే.. మొదటి ఇన్నింగ్స్లో 209కే ఆలౌట్ అయి ఫాలో ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో ధీటుగా ఆడింది. 483 రన్స్ చేసింది. ఛేజింగ్లో ఇంగ్లండ్ కడదాకా పోరాడిన ఫలితం లేకపోయింది. ఇంతకుముందు భారత్, ఇంగ్లండ్ జట్లు ఫాలో ఆన్ ఆడి మ్యాచ్ గెలిచి సంచలనం నమోదు చేశాయి. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా ఈ జాబితాలో చేరింది. దాదాపు 146 ఏళ్ల టెస్టు ఫార్మాట్ చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగోసారి.