ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు.. ఆయన నిలువెత్తు విగ్రహం కనువిందు చేయనుంది. వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబై క్రికెట్ ఆసోషియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ఉదయం ప్రకటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంలో ఒక ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తొలిసారి అని కాలే తన ప్రకటనలో పేర్కొన్నారు.
2023 క్రికెట్ వరల్డ్కప్ సందర్భంగా ఎంసీఏ లాంజ్ బయట ఉన్న సర్క్యులర్ ప్లాట్ఫామ్పై సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అమోల్ కాలే తెలిపారు. ఎంసీఏ ఈ ఏడాది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం గోల్డ్ జూబ్లీ ఇయర్ ఉత్సవాలను నిర్వహించబోతున్నది. ఆ ఉత్సవాల్లో భాగంగానే సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాలను అమోల్ కాలే మీడియాకు వెల్లడించినప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆయన పక్కనే ఉన్నాడు. సచిన్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. వాంఖడే స్టేడియం తనకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాడు. తన తొలి రంజీ మ్యాచ్, ఆఖరి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఇదే వేదికపై ఆడానని తెలిపాడు.
‘ఆటలో నాకు 25 ఏళ్ల అనుభవం ఉన్నా నేను 25 ఏళ్ల వాడిలా ఉన్నా. అందుకు నేను ఎంసీఏకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాంఖడేలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎంసీఏ నాకు సమాచారం ఇచ్చింది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం. అందుకే విగ్రహం ఎలా ఉండాలి..? స్టేడియంలోని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయాలి..? అనే అంశాలపై చర్చించేందుకు ఈరోజు (మంగళవారం) వాంఖడేకు వచ్చా. ఇలాంటి సందర్భాలు అత్యంత అరుదుగా వస్తాయి’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.
కాగా, సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్లు, 463 వన్డే మ్యాచ్లు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి మొత్తం 34,357 పరుగులు చేశాడు. అంతేగాక అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా 2011లో సచిన్ వాంఖడే స్టేడియంలో క్రికెట్ ప్రపంచకప్ను గెలిచాడు.
ఇవి కూడా చదవండి..