IND vs AUS | తొలి రెండు టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆస్ట్రేలియా.. ఇండోర్లో సత్తాచాటేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నది. ఇండోర్ వేదికగా బుధవారం నుంచి ‘బోర్డర్-గవాస్కర్’సిరీస్ మూడో టెస్టు ప్రారంభం కానుండగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడమే లక్ష్యంగా భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తున్నది. ఇటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గంటల కొద్ది నెట్స్లో శ్రమిస్తుంటే.. అటువైపు స్మిత్, లబుషేన్, ఖవాజా భాతర స్పిన్ త్రయాన్ని జయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇండోర్: ఇప్పటికే ‘బోర్డర్-గవాస్కర్’ట్రోఫీని చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో విజృంభించేందుకు కసరత్తులు చేస్తున్నది. ముఖ్యంగా భారత పిచ్లపై స్పిన్ను ఎదుర్కోలేక చతికిలబడుతున్న కంగారూలు.. ఇండోర్లో స్పిన్ ఉచ్చును జయించేందుకు ముమ్మర సాధన చేస్తున్నారు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండింట్లో విజయాలు సాధించిన భారత జట్టు కూడా సాధన కొనసాగిస్తున్నది. మరో మ్యాచ్ నెగ్గితే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడంతో పాటు.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో రోహిత్ సేన అగ్రస్థానానికి చేరడం ఖాయమే. దీంతో మనవాళ్లు అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఇండోర్ స్టేడియంలో రవిచంద్రన్ అశ్విన్కు మెరుగైన రికార్డు ఉండటం ఆసీస్ను మరింత కలవరపెడుతున్నది. ఈ ఆఫ్స్పిన్నర్ ఇండోర్లో ఆడిన రెండు టెస్టుల్లో 12.5 సగటుతో 18 వికెట్లు పడగొట్టడం విశేషం. సిరీస్ ప్రారంభానికి ముందు అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు తమ వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయని బీరాలు పలికిన కంగారూలు.. బరిలోకి దిగాక అశ్విన్, జడేజా ధాటికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతున్నదని.. అది మంచి పద్దతి కాదని ఆసీస్ మాజీలు హెచ్చరిస్తున్నారు. గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్లిన కెప్టెన్ కమిన్స్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో ఇండోర్ పోరుకు స్మిత్ కంగారూల బృందానికి సారథ్యం వహించనున్నాడు. భారత స్పిన్ త్రయాన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం కంగారూలు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం స్మిత్, లబుషేన్ సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. హెడ్, ఉస్మాన్ ఖవాజా కూడా సాధన కొనసాగించారు.
కాస్త సంయమనం పాటిస్తే భారత పిచ్లపై పరుగులు చేయడం పెద్ద కష్టం కాదని వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ అన్నాడు. డిఫెన్స్కు కట్టుబడి ఉంటే పరుగులు వాటంతటవే వస్తాయని పేర్కొన్నాడు. గత టెస్టుల్లో ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు స్వీప్ షాట్లు ఆడే ప్రయత్నంలో ఔటైన విషయం తెలిసిందే.
గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ వంద శాతం ఫిట్గా లేకున్నా.. కమిన్స్ స్థానంలో తుది జట్టులో అతడు ఆడటం ఖాయంగా కనిపిస్తున్నది. సోమవారం స్టార్క్ అరగంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అతడితో పాటు ఆల్రౌండర్ గ్రీన్ కూడా ఇండోర్ కూడా నెట్స్లో సుదీర్ఘ స్పెల్స్ వేశాడు.
గత రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే అతడి ఎంపికపై మాజీలు విమర్శలు గుప్పిస్తుండటంతో పాటు.. శుభ్మన్ గిల్ వంటి ఇన్ఫామ్ బ్యాటర్ను పక్కనపెట్టడం మేనేజ్మెంట్కు కష్టంగా మారింది. దీంతో తదుపరి టెస్టుకు రాహుల్ను వైస్కెప్టెన్సీ నుంచి తొలగించి సెలక్షన్ కమిటీ ముందే హెచ్చరికలు పంపింది. ఈ నేపథ్యంలో సోమవారం రాహుల్తో పాటు గిల్ సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.