ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు. అయితే సౌతాఫ్రికా సిరీస్కు ముందే గాయం కారణంగా రాహుల్.. ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యాడు.
లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలోనే రోహిత్ కరోనా బారినపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ టెస్టుకు భారత కెప్టెన్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే ప్రశ్న తలెత్తింది. ఒకవేళ రోహిత్ కోలుకోకుంటే టీమిండియా ఓపెనర్గా ఎవరు బరిలో దిగాలి? అనేది పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ను ఇంగ్లండ్ పిలిపించడం జరిగింది. అయితే ఇది కచ్చితంగా సెలెక్టర్ల తప్పేనని సెహ్వాగ్ అన్నాడు. ‘‘జట్టును ప్రకటించే సమయంలో రోహిత్ ఫిట్గా ఉన్నాడు. గిల్ ఫిట్గా ఉన్నాడు అని మాత్రమే సెలెక్టర్లు ఆలోచించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా వాళ్లకు బ్యాకప్ ఉండాలి కదా?’’ అని సెహ్వాగ్ అన్నాడు.
‘‘ఒకవేళ రోహిత్ ఆడకుంటే అతని స్థానంలో కేఎస్ భరత్ లేదా పుజారా ఓపెనింగ్ చేస్తారని అనుకుందాం. వాళ్లు విఫలమైతే మరో అవకాశం ఇస్తారా? ఇలా సడెన్గా ఒకరిని ఓపెనర్ చేసినప్పుడు వాళ్లకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. నువ్వు విఫలమైనా కూడా నీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పాలిగా.
అసలు ఇంతమంది జట్టును ప్రకటించినప్పుడు ఓపెనర్లకు బ్యాకప్ లేకపోవడం అనేది సెలెక్టర్లు చేసిన అతిపెద్ద తప్పని నా అభిప్రాయం’’ అని సెహ్వాగ్ తేల్చిచెప్పాడు. అంతేకాదు, ప్రస్తుతం రోహిత్ లేకపోతే భారత జట్టుకు నాయకత్వం ఎవరు వహిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.