కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆదివారం పతకాల సంఖ్య మరింత పెరిగింది. మహిళల 48 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ నీతు గంగాస్.. బంగారు పతకం సాధించింది. ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన డెమీ జేడ్పై నీతూ గెలుపొంది స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ పంగల్.. కియరన్ మెక్ డొనాల్డ్పై విజయం సాధించి, గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాడు.
ఇక కాంస్య పోరులో భారత మహిళల హాకీ జట్టు విజయం సాధించింది. సెమీస్లో ఆసీస్తో మ్యాచ్ మాదిరే పెనాల్టీ షూట్ అవుట్ వరకు వెళ్లిన ఆటలో భారత జట్టు.. 2-1 (1-1) తేడాతో గెలుపును అందుకుని కాంస్యాన్ని సాధించింది.
కాంస్యం కోసం జరిగిన పోరులో భారత జట్టు మొదటి క్వార్టర్లోనే తొలి గోల్ కొట్టింది. సలీమా తెటె గోల్ చేసి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత రెండు క్వార్టర్లలో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం తీవ్ర యత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. కానీ ఇక మ్యాచ్ ముగుస్తుందనగా ఆటలో హైడ్రామాకు తెరతీసింది ఒలివియా మెర్రీ..
ఆట మరో 20 సెకన్లలో ముగుస్తుందనగా ఒలివియా గోల్ కొట్టింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూట్ అవుట్ను ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత్ రెండు గోల్స్ కొట్టగా.. న్యూజిలాండ్ ఒక్క గోల్ మాత్రమే చేసింది. భారత కెప్టెన్, గోల్ కీపర్ సవితా పునియా న్యూజిలాండ్ ఆటగాళ్ల గోల్స్ను అడ్డుకుని దేశానికి మరో పతకాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది.