సొంతగడ్డపై సిరీస్ విజయాలు సాధించడం టీమ్ఇండియాకు కొత్తేం కాదు! టాపార్డర్ దంచికొట్టడం.. ఆనక ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరిబిక్కిరి చేయడం భారత్కు వెన్నెతోపెట్టిన విద్యే!! అయితే తాజా సిరీస్లను గమనిస్తే ఈ ఫార్ములాలో మార్పులు కనిపించక మానవు! నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు.. మొత్తం 12 మ్యాచ్ల్లో కోహ్లీ సేన తరఫున నాలుగే శతకాలు నమోదయ్యాయి! ఇందులోనూ టాప్-3 ఆటగాళ్లు చేసింది ఒకే ఒక్కటి! అయినా పర్యాటక జట్టుపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిందంటే అదంతా కొత్త కుర్రాళ్ల చలవే!
విపరీతమైన పోటీ మధ్య టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న ప్రతీ ఆటగాడు బెబ్బులిలా విజృంభించడంతో మూడు సిరీస్లు భారత్ వశమయ్యాయి. సీమర్గా జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్రౌండర్గా సత్తాచాటితే.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా అవకాశం వచ్చిన వాళ్లంతా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కెరటాల ప్రదర్శనపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
‘ప్రస్తుత క్రికెట్లో బెంచ్ బలం అత్యధికంగా ఉన్న జట్టు టీమ్ఇండియానే. కోహ్లీ సేనను చూస్తుంటే.. 70వ దశకంలో వెస్టిండీస్, 90వ దశకంలో ఆస్ట్రేలియాను చూసినట్లు అనిపిస్తున్నది. జాతీయ జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పుడే ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన బయట పడుతుంది’.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్న మాటలివి. కరోనా బ్రేక్ తర్వాత సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమ్ఇండియా కంగారూ గడ్డపై పొట్టి సిరీస్తో పాటు చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించి భళా అనిపించింది. ఆసీస్కు ట్రైలర్తో సరిపెట్టిన మనవాళ్లు.. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు దిమ్మతిరిగే బొమ్మ చూపెట్టారు. మూడు ఫార్మాట్లలోనూ పర్యాటక జట్టును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్పై అనుమానాలు రేగగా.. మిగిలిన మూడు మ్యాచ్లను ఏకపక్షంగా గెలిచి సిరీస్తో పాటు డబ్ల్యూటీసీ తుది పోరుకు కోహ్లీసేన అర్హత సాధించింది. అదే ఊపులో టీ20, వన్డే సిరీస్లను పట్టేసి హ్యాట్రిక్ కొట్టింది.
కృనాల్, కృష్ణ, కిషన్ కూడా..
పొట్టి సిరీస్ ఆరంభ మ్యాచ్లకు రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో ఓపెనర్గా బరిలోకి దిగిన జార్ఖండ్ చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్.. అరంగేట్ర మ్యాచ్లోనే అర్ధశతకం బాదాడు. మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను తలపిస్తూ.. ఎడమచేత్తో అతడు సాగించిన విధ్వంసకాండ ఇప్పట్లో మరువలేనిది. ఇక మొదటిసారి వన్డే జట్టులో ప్లేస్ దక్కించుకున్న హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కూడా తొలి మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మిడిలార్డర్లో భారీ షాట్లు ఆడగలగడంతో పాటు.. తన ఉపయుక్తకరమైన స్పిన్తో ఐపీఎల్లో ముంబై జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగిన కృనాల్.. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. ఇక దేశవాళీ ప్రదర్శనతో వన్డే జట్టులో చోటు దక్కించుకున్న కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ.. అరంగేంట్రలోనే 4 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. వీరితో పాటు గాయం అనంతరం తిరిగి వచ్చిన భువనేశ్వర్, నటరాజన్ జట్టు విజయాల్లో కీలకమయ్యారు.
మరో పేస్ ఆల్రౌండర్..
ఈ సిరీస్ల ద్వారా భారత జట్టుకు మరో పేస్ ఆల్రౌండర్ లభించాడు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లలో బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో శార్దూల్ ఠాకూర్ ఉత్తుంగతరంగంలా దూసుకొచ్చాడు. మీడియం పేసర్గా జట్టులో చోటు దక్కించుకున్న ఈ ముంబైకర్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో సెలెక్టర్లను సైతం ఆకట్టుకున్నాడు. లోయర్ ఆర్డర్లో భారీ షాట్లతో పాటు స్ట్రయిక్ రొటేట్ చేయడం బాగా తెలిసిన శార్దూల్ మిడిల్ ఓవర్లలో బౌలింగ్లోనూ కీలక వికెట్లు పడగొట్టి కెప్టెన్ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆదివారం చివరి వన్డే అనంతరం భారత సారథి విరాట్ మాట్లాడుతూ.. నాలుగు వికెట్లు తీయడంతో పాటు కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి 30 పరుగులు చేసిన శార్దూల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కకపోవడం ఆశ్చర్యమేసిందన్నాడంటే.. అతడి ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు.
సలామ్ సూర్య
చాన్నాళ్లుగా భారత జట్టులో చోటు ఆశిస్తున్న ముంబై మిడిలార్డర్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్కు ఎట్టకేలకు ఇంగ్లండ్తో సిరీస్కు పిలుపు వచ్చింది. రెండో టీ20లో చాన్స్ దక్కినా.. తన సహచర ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక నాలుగో మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సూర్య అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా అతడు బ్యాటింగ్ చేసిన తీరు క్రీడా విశ్లేషకులను ముక్కున వేలేసుకునేలా చేసింది. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ గంటకు 150 కిలోమీటర్లకు తగ్గకుండా బంతులు విసురుతుంటే.. సూర్య మాత్రం ఇవేవి తనను ఇబ్బంది పెట్టలేవన్నట్లు సొగసైన షాట్లతో పరుగులు రాబట్టాడు. టీ20 ప్రపంచకప్నకు ముందు యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలనే ఉద్దేశంతో ప్రయోగాలు చేసిన టీమ్ఇండియాకు ఒక్కో స్థానానికి రెండేసి ప్రత్యామ్నాయాలు లభించగా.. తుది జట్టు ఎంపిక కత్తిమీద సాములా మారింది.
అక్షర్తో మొదలు..
అప్పుడెప్పుడో ఏడేండ్ల క్రితం పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అక్షర్ పటేల్ ఇన్నాళ్లకు టెస్టుల్లో అరంగేట్ర అవకాశం దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా గైర్హాజరీలో మూడు టెస్టులు ఆడిన అతడు 27 వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించుకున్నాడు. ఇందులో నాలుగుసార్లు ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. సీనియర్ అశ్విన్తో కలిసి అతడు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్లో పెద్దగా అవకాశం రాకపోయినా.. ఐపీఎల్ చూసినవారికి అక్షర్ ఎలాంటి విధ్వంసకర బ్యాట్స్మనో తెలిసే ఉంటుం ది. మున్ముందు చాన్స్ వస్తే బ్యాట్తోనూ సత్తాచాటేందుకు నేను రెడీ అని నిరూపించుకున్న అక్షర్.. భవిష్యత్పై ఆశలు పెంచాడు.
సుందర్ సూపర్
నాలుగేండ్ల క్రితమే పొట్టి ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాషింగ్టన్ సుందర్.. పవర్ప్లేల్లో పొదుపుగా బంతులేసే స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి జట్టుకు శుభారంభాన్నివ్వడంతో పాటు మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి భారీ షాట్లతో విరుచుకుపడటం సుందర్కు దేశవాళీల నుంచే అలవాటు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సాంగత్యంలో మరింత రాటుదేలిన ఈ తమిళనాడు ఆల్రౌండర్.. తాజాగా టెస్టుల్లోనూ తన సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. మూడు టెస్టుల్లో రెండుసార్లు సెంచరీకి సమీపించాడు. చెన్నై తొలి టెస్టులో 85 పరుగులు చేసిన వాషింగ్టన్.. అహ్మదాబాద్లోజరిగిన చివరి టెస్టులో 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. పొట్టి సిరీస్లోనూ పొదుపుగా బౌలింగ్ చేసిన సుందర్.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి శెభాష్ అనిపించుకున్నాడు.
ఇవి కూడా చదవండి: