T20 World Cup 2024 : వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు నేపాల్(Nepal), ఒమన్(Oman) అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన ఆసియా క్వాలిఫయర్ సెమీఫైనల్లో అద్భుత విజయంతో ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్లో ఆడే చాన్స్ దక్కించుకున్నాయి. యూఏఈపై నేపాల్ 8 వికెట్లతో గెలుపొందగా.. బహ్రెయిన్పై ఒమన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో, టీ20 వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించిన జట్ల సంఖ్య 18కి చేరింది. ఇక రెండు బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆఫ్రికా క్వాలిఫయర్ ఫలితాలతో ఆ రెండు జట్లు ఏవో తేలిపోనుంది.
ఆసియా క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపాల్ మరోసారి అదరగొట్టింది. కిర్తిపూర్లో జరిగిన సెమీఫైనల్లో కుశాల్ మల్లా, సందీప్ లమిచానే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. యూఏఈ బ్యాటర్లు చేతులెత్తేశారు. వ్రిత్య అరవింద్ ఒక్కడే అర్ధ శతకంతో పోరాడాడు. 135 పరుగుల ఛేదనలో నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఒమన్ జట్టు
ఒమన్ బౌలర్ ఆఖిబ్ ఇయాస్ నాలుగు వికట్లతో బహ్రెయిన్ భరతం పట్టాడు. దాంఓత, 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కశ్యప ప్రజాపతి, ప్రతిక్ అథవాలే బహ్రెయిన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, ఆరు ఓవర్లలోనే ఒమన్ మ్యాచ్ ముగించింది.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ గడ్డపై జరుగనుంది. ఇప్పటికే ఐసీసీ టోర్నీ వేదికలను కూడా ఖరారు చేసింది. ఈ పోటీల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.