వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆ జట్టు.. సోమవారం ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో గెలిచి టాప్-2 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తూ నటాలి సీవర్ బ్రంట్ (57 బంతుల్లో 100 నాటౌట్, 16 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. హేలీ మాథ్యూస్ (39 బంతుల్లో 56, 9 ఫోర్లు) ఆల్రౌండ్ షోతో రాణించింది. అనంతరం భారీ ఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లలో 184/9 స్కోరు వద్ద ఆగిపోయింది. రిచా ఘోష్(50 బంతుల్లో 90, 10ఫోర్లు, 6సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీతో పోరాడినా ఆర్సీబీకి విజయాన్ని అందించలేకపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇన్నింగ్స్ నెమ్మదిగానే మొదలైంది. మూడో ఓవర్లోనే సజీవన్ (7) వికెట్ను కోల్పోయిన ఆ జట్టు.. పవర్ ప్లేలో చేసింది 38 పరుగులే. సీవర్, మాథ్యూస్ క్రీజులో కుదురుకునేదాకా బంతికో పరుగు అన్నట్టుగానే ఆడారు. కానీ 10వ ఓవర్ నుంచి ఈ ఇద్దరూ గేర్ మార్చారు. నదైన్ డి క్లెర్క్ 11వ ఓవర్లో 6, 4 బాదిన సీవర్.. శ్రేయాంక 12వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో అర్ధ శతకాన్ని సాధించింది. ఆ తర్వాత రాధా బౌలింగ్లోనే మూడు ఫోర్లు కొట్టింది. అరుంధతి 14వ ఓవర్లో రెండు బౌండరీలతో హీలి కూడా ఫిఫ్టీ పూర్తిచేసింది. బెల్ 15వ ఓవర్లో హీలి నిష్క్రమించడంతో 131 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత సీవర్.. హర్మన్ప్రీత్ (20)తో కలిసి ఇన్నింగ్స్ జోరును కొనసాగించింది. వరుస బౌండరీలతో చెలరేగిన ఆమె.. శ్రేయాంక ఆఖరి ఓవర్లో సింగిల్తో శతకాన్ని నమోదుచేసి ఈ టోర్నీ చరిత్రలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
భారీ ఛేదనలో బెంగళూరు ఇన్నింగ్స్ ధాటిగానే మొదలైనా ఆ తర్వాత 10 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా సాగింది. హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన హరీస్ (15)ను షబ్నమ్ ఔట్ చేస్తే మాథ్యూస్ నాలుగో వోర్లో స్మృతి (6), జార్జియా (9)ను వెనక్కిపంపింది. గౌతమి (1), రాధా యాదవ్ కూడా వారిని అనుసరించడంతో ఆ జట్టు 35/5తో నిలిచింది. కానీ డి క్లెర్క్ (28).. రిచా ఘోష్తో కలిసి కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఓవైపు సహచరులు వెంటవెంటనే నిష్క్రమిస్తున్నా..రిచా వెనుకకు తగ్గలేదు. ముంబై బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ లక్ష్యాన్ని అంతకంతకు కరిగించింది. అమన్జ్యోత్ వేసిన 19వ ఓవర్లో రిచా హ్యాట్రిక్ సిక్స్లతో దుమ్మురేపగా, తానేం తక్కువ కాదన్నట్లు శ్రేయాంక రెండు ఫోర్లతో 27 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో సమీకరణం కాస్తా 6 బంతుల్లో 32గా మారింది. కెర్ను లక్ష్యంగా చేసుకుంటూ రిచా 4, 6, 6తో చెలరేగినా ఆఖరి బంతికి ఔట్ కావడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది.