సంగారెడ్డి, జూలై 21(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు తాగునీటి గండం ముంచుకొస్తున్నది. ఎల్నినో ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో ఆశించిన వర్షాలు కురవడం లేదు. దీనికితోడు మరమ్మతు పనుల కారణంగా సింగూరు ప్రాజెక్టులో నీటిని పూర్తిగా దిగువకు వదిలారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలకు తాగునీటి ఇక్కట్లు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. సింగూరు ప్రాజెక్టు బండ్ మరమ్మతులు వచ్చే ఏడాది వరకు కొనసాగనున్నాయి. దీంతో వర్షాలు కురిసినా ప్రాజెక్టు పూర్తిగా నింపలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 4.295 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నాయి.
చాలాచోట్ల మిషన్ భగీరథ తాగునీటి పథకాలకు మంజీరా జలాల పంపింగ్ చేయడం కష్టంగా మారుతోంది. సింగూరు బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పంపింగ్ కేంద్రాల వద్ద తాగునీటి సరఫరాపై మొదట ఎక్కువగా ప్రభావం పడనున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 72 గ్రామాలకు రాఘవాపూర్ పంపింగ్ కేంద్రం ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. రాబోయే 45రోజులు మాత్రమే రాఘవపూర్ వద్ద నీటిని పంపింగ్ చేయడం సాధ్యమవుతుంది.ఆ తర్వాత పంపింగ్ అవసరమైన జలాలు మంజీరానదిలో ఉండవని అధికారులు చెబుతున్నారు. 45 రోజుల తర్వాత న్యాల్కల్, ఝరాసంగం మండలాలకు మిషన్ భగీరథ ద్వారా మంజీరానీటి సరఫరా నిలిచిపోనుంది. దీంతో 45రోజుల తర్వాత రెండు మండలాల్లోని 72 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య ప్రారంభం కానున్నది.
సంగారెడ్డి జిల్లా పుల్కల్లోని సింగూరు ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు.ఎల్నినో కారణంగా వర్షాలు పడటం లేదు. దీంతో మంజీరా నదిలోకి వరద రావడం లేదు. ఒకవేళ వర్షాలు కురిసినా సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా వరద నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేదు. సింగూరు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ 0.7 టీఎంసీ పోగా, 3.595 జలాలు ఉంటాయి.
ప్రాజెక్టులోని 3.595 జలాలతో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేవలం మరోమూడు నెలలు మాత్రమే తాగునీటి సరఫరా చేయవచ్చు. ఆ తర్వాత సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టులో ఉన్న జలాలను పూర్తిగా సంగారెడ్డి జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం నిల్వ చేసి ఉంచాలని, హైదరాబాద్ ఇతర జిల్లాలకు తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.61 కోట్లతో ప్రత్యామ్నాయ తాగునీటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మిషన్భగీరథ ఎస్ఈ రఘువీర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు రూ.41 కోట్లు, మెదక్ జిల్లాకు రూ.20 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.