మధిరరూరల్, జూలై 21: అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకుల అండతో కాంట్రాక్టర్ ఏటి ఇసుకను, మట్టిని అక్రమంగా తోడేస్తున్నారని, ప్రకృతి వనరులను దోచుకుంటూ పర్యావరణ విధ్వంసం సృష్టిస్తున్నారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మండిపడ్డారు. మధిర ఏటి వద్ద నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను, అకడ జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను మంగళవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోకి వరద నీరు రాకుండా రక్షణగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ను బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని, మేము దీనికి వ్యతిరేకం కాదన్నారు.
కానీ, నిర్మాణ పనుల నెపంతో సాగుతున్న అక్రమ దోపిడీని మాత్రం సహించేది లేదన్నారు. నియమ నిబంధనల ప్రకారం క్వారీల నుంచి గ్రావెల్కు అనుమతులు తెచ్చుకుని, స్థానికంగా ఏటిలో నుంచి 20 అడుగుల లోతు తవ్వి ఆ మట్టినే ఇకడ వాడుతూ, కోట్ల రూపాయల సొమ్ము పోగేసుకుంటున్నారని ఆరోపించారు. రాయపట్నం వద్ద ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకొని, నిబంధనలకు విరుద్ధంగా మధిర రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఏటి నుంచి ఇసుకను తోడేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక, గ్రావెల్ను తవ్వుతూ శివాలయం సమీపంలోని రీచ్లకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఏటిలో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టడం వల్ల రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి, పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మధిరలో జరుగుతున్న ఈ దందా, దోపిడీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వైవీ అప్పారావు, చిత్తారు నాగేశ్వరరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాసర్రెడ్డి, ఐలూరి ఉమామహేశ్వర్రెడ్డి, ఆళ్ల నాగబాబు, పరిశ శ్రీనివాసరావు, చీదిరాల రాంబాబు, అబ్దుల్ ఖురేషి, ముత్తవరపు ప్యారి, వీరంశెట్టి సీతారామయ్య, నాగేశ్వరరావు, ఆరుద్ర కొండలరావు, షేక్ జాన్ సైదా, వేల్పుల శ్రీనివాసరావు, జిల్లా ప్రవీణ్, కోట కోటేశ్వరరావు, సంపశాల కొండ, నాగులవంచ రామారావు, బత్తుల శ్రీనివాసరావు, షేక్ మదార్, షేక్ మౌలాలి పాల్గొన్నారు.