Nikhat Zareen | నిఖత్.. నిఖత్ భారత బాక్సింగ్ యవనికపై వెలుగులీనుతున్న పేరు. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో ఈ తెలంగాణ యువ బాక్సర్ దిగ్విజయంగా దూసుకెళుతున్నది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుసగా రెండోసారి పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించిన నిఖత్..పారిస్ ఒలింపిక్స్లోనూ కచ్చితంగా పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నది. అంతకుముందు ఆసియా గేమ్స్లో సత్తాచాటి విశ్వక్రీడల బెర్తు దక్కించు కుంటానని మెండైన ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తానని పేర్కొంది. సీఎం కేసీఆర్ అందిస్తున్న మద్దతు మరువలేనిదని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించి సొంత ఇలాఖాలో అడుగుపెట్టిన యువ బాక్సర్ నిఖత్ జరీన్కు ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న తెలంగాణ బిడ్డకు అభిమానులు జేజేలు పలికారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు సార్థకత చేకూరుస్తూ స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో ప్రత్యర్థులను నిఖత్ మట్టికరిపించి తన పంచ్ పవర్కు తిరుగులేదని చాటిచెప్పింది. సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో మెగాటోర్నీ అనుభవాలతో పాటు భవిష్యత్ లక్ష్యాలను వివరించింది. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రతిభ కల్గిన యువ బాక్సర్లను తీర్చిదిద్దేందుకు బాక్సింగ్ అకాడమీ ఏర్పాటుపై నిఖత్ మాటల్లోనే.
ప్రపంచ టోర్నీలో పతకం గెలువడంపై?
వివిధ దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొన్న బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో చాంపియన్గా నిలువడం మరిచిపోలేని అనుభూతి. ముఖ్యంగా వరుసగా రెండోసారి పతకం సాధించడం చాలా గర్వంగా ఉంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దీనికి తోడు స్వదేశంలో అభిమానుల మధ్య టోర్నీ జరుగడంతో సహజంగానే నాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా రాణించడం కత్తిమీద సామే అనిపించింది.
మెగాటోర్నీలో పోటీ ఎలా ఉంది?
ఈ ప్రపంచ చాంపియన్షిప్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. గత టోర్నీతో పోలిస్తే ఈసారి నేను 52 కేజీలకు బదులు 48-50 కిలోల విభాగానికి మారా ను. దీంతో అన్సీడెడ్గా పోటీపడాల్సి వచ్చింది. టోర్నీలో మొత్తం ఆరు బౌట్ల లో బరిలోకి దిగాను. బై లభించకపోవడంతో వరుసగా విరామం లేకుం డా పోటీకి దిగాల్సి వచ్చింది. దీంతో ఒకింత అలసట దరిచేరింది. అయినా వెనుకకుపోకుండా బౌట్ బౌట్కు మరింత దూకుడు కనబరిచాను. సెమీస్ బౌట్ చాలా టఫ్గా సాగగా, ఫైనల్ మ్యాచ్ హోరాహోరీని తలపించింది.
పారిస్లో పతక అవకాశాలపై?
వచ్చే ఏడాది పారిస్లో జరిగే ఒలింపిక్స్లో ఎలాగైనా పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాను. అందుకనే విశ్వక్రీడల్లో పతకాన్ని ముద్దాడాలన్న లక్ష్యంతో బరువు కేటగిరీ కూడా మారాను. ఇందుకోసం శరీర బరువు తగ్గించుకునేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఓవైపు ఫిట్నెస్పై దృష్టి పెడుతూనే టెక్నిక్ పరంగా మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇందుకోసం అవసరమైతే విదేశాల్లో శిక్షణ తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తాను.
అకాడమీ ఏర్పాటుపై మీ ఆలోచన?
ప్రతిభ కల్గిన యువ బాక్సర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉంది. ప్రభుత్వ సహకారంతో చేయాలనుకుంటున్నా ను. ప్రస్తుతం మన దగ్గర బాక్సింగ్కు అంతగా అనువైన సౌకర్యాలు లేవు. అంతర్జాతీయ స్థాయిలో యువ బాక్సర్లకు తర్ఫీదు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
ప్రభుత్వ ప్రోత్సాహంపై స్పందన?
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. 2015లో సీఎం కేసీఆర్ తొలిసారి 50 లక్షల ఆర్థిక సాయంతో కెరీర్ ఉన్నతికి తోడ్పాటు అందించారు. గతేడాది ప్రపంచ టోర్నీలో పసిడి సాధించడం ద్వారా రెండు కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు జూబ్లిహిల్స్లో నివాసస్థలం, డీఎస్పీ పోస్టింగ్ ఇచ్చి మద్దతుగా నిలిచారు. ప్రతీ సందర్భంలో సీఎం కేసీఆర్ వెన్నంటి నిలుస్తున్నారు. భవిష్యత్లోనూ ప్రభుత్వ తోడ్పాటుతో మరిన్ని విజయాలు సాధిస్తాను.
ఆసియా గేమ్స్ సన్నద్ధతపై?
టోర్నీ టోర్నీకి లక్ష్యాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్ ఆ తర్వాత కామన్వెల్త్గేమ్స్, జాతీయ చాంపియన్షిప్ ఇలా టోర్నీ ఏదైనా పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. అలాగే సెప్టెంబర్లో చైనాలో జరిగే ఆసియాగేమ్స్లో స్వర్ణం గెలువడం ద్వారా పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించవచ్చు. విశ్వక్రీడలకు ఆసియాగేమ్స్ అర్హత టోర్నీ. త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెడుతా.