MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ రెండో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ (77), నాట్ సీవర్ బ్రంట్(55) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దాంతో, 14.2 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. విధ్యంసక బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకు పడిన మ్యాథ్యూస్ 26 బంతుల్లో ఫీఫ్టీ రన్స్ చేసింది. బ్రంట్తో కలిసి రెండో వికెట్కు అత్యధికంగా 114రన్స్ జోడించింది.
వీళ్లు ధాటిగా ఆడడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆర్సీబీ ప్రధాన బౌలర్లు రేణుకా సింగ్, పెర్రీ ప్రభావం చూపలేకపోయారు. ప్రీతి బోస్ మాత్రమే ఒక వికెట్ తీసింది. బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించన ఆర్సీబీ, బౌలింగ్లో తేలిపోయింది. వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
మోస్తరు టార్గెట్ 156తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అవలీలగా గెలిచింది. 45 పరుగుల వద్ద ఓపెనర్ యస్తికా భాటియా (23) వికెట్ కోల్పోయింది. ప్రీతి బోస్ వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. అయినా కూడా మ్యాథ్యూస్, బ్రంట్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్ హిట్టింగ్ చేసిన ఈ జోడీ ఏ దశలోనూ ఆర్సీబీ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. రెండో వికెట్కు రికార్డు స్థాయిలో 114 పరుగులు జోడించారు.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 155కు ఆలౌట్ అయింది. మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఆ జట్టు కుప్పకూలింది. ముంబై బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకదశలో ఆ జట్టు 100 రన్స్ కూడా చేస్తుందో, లేదో అనిపించింది. అయితే.. రీచా ఘోష్ (28) కనికా ఆహుజా (22), శ్రేయాంక్ పాటిల్ (23), మంధాన (23) ఆ జట్టును ఆదుకున్నారు. ముంబై బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ మూడు, సాయిక్ ఇజాక్, అమెలియా కేర్ రెండు వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్, నాట్ సీవర్ బ్రంట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ, అమేలియా కేర్ (47), హేలీ మ్యాథ్యూస్ (44) రాణించడంతో 143 రన్స్ తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ (84), మేగ్ లానింగ్ ఫిఫ్టీలతో చెలరేగడంతో ఆ జట్టు 207 రన్స్ చేసింది.